Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కరీంనగర్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రద్దుచేయడం శోచనీయమని, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్లో 118 మంది జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
రాజకీయ కక్షలో భాగంగానే బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదనను మిగిల్చడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిషారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమని తెలిపారు. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేయొద్దని, ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు తెలిపారు.