హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ఆదేశించింది. డీపీఆర్ తయారీ కోసం కూడా ఎటువంటి తవ్వకాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఒకరు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాస్తవాలు తేల్చేందుకు ఎన్జీటీ గతంలోనే నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై విచారణ పూర్తవ్వడంతో శుక్రవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో జరిగిన పనులు, వాటివల్ల పర్యావరణానికి వాటిల్లిన నష్టం, ఏపీ సర్కారు చేసిన ఖర్చు, తదితర సాంకేతిక అంశాల పరిశీలనకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణశాఖ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. కమిటీ నివేదిక ఇవ్వడానికి నాలుగు నెలల గడువు విధించింది.