కమ్మర్పల్లి, ఫిబ్రవరి 3: ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా ఎల్ఎండీకి నీటి విడుదలను వెంటనే ఆపాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారులకు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీ నుంచి కొద్దిరోజులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ఎండీకి నీటి విడుదల జరుగుతున్నది. మరోవైపు ఎస్సారెస్పీలో అందుబాటులో ఉన్న నీటి నిల్వ, ప్రాజెక్టు పరిధిలోని నిజామాబాద్ జిల్లా ఆయకట్టుకు సాగు, తాగునీటికి నీటి ఆవశ్యకత దృష్ట్యా ఆందోళన మొదలైంది. దీంతో రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి శనివారం సాయంత్రం ఎస్సారెస్పీ సీఈ, ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు.
ఎల్ఎండీకి వరదకాలువ ద్వారా ఎంత నీటి విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ? ఈ రోజు వరకు ఎంత విడుదల చేశారు… తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 3 టీఎంసీల వరకే నీటి విడుదల చేయాలని ఉత్తర్వులు ఉంటే అంతకు మించి విడుదల జరిగినట్లు అధికారుల వివరణలో వెల్లడైంది. దీంతో ఎల్ఎండీకి వెంటనే నీటి విడుదల ఆపాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. జిల్లాలో చౌట్పల్లి హన్మంత్రెడ్డి, లక్ష్మీ కెనాల్, గుత్ప, అలీసాగర్ తదితర లిఫ్టులు, ప్యాకేజీ 21 కింద ఆయకట్టుకు సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు ఇవ్వాల్సి ఉన్నందున నీటి విడుదల ఆపివేయాలని ఎమ్మెల్యే అన్నారు. నీటి విడుదల ఆపివేసి వరదకాలువను పూర్తిగా నింపి పెట్టాలని సూచించారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. సాగు, తాగునీటి అవసరాలు, రైతుల్లో నెలకొన్న ఆందోళనను గుర్తించి ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడడంపై రైతుల్లో హర్షంవ్యక్తమవుతున్నది. వరదకాలువ ద్వారా ఎల్ఎండీకి మరోసారి నీటి విడుదలకు ఏవైనా ఆదేశాలు వస్తే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం సాయంత్రం నీటివిడుదల నిలిపివేశారు.