జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎర్దండి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు అరవింద్ ఇవాళ ఉదయం వెళ్లారు. పార్లమెంట్కు ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గ్రామాలను వరదలు ముంచెత్తినా రాలేదని వారు వాపోయారు. రాజకీయం కోసమే తమ గ్రామానికి ఎంపీ వచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామస్తులను పోలీసులు శాంతింపజేశారు.