గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
రాష్ట్రంలో ఇలాంటివి లభించడం రెండోసారి
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోర్లాల్గూడ రిజర్వ్ ఫారెస్ట్లో చిన్నరాళ్లగుట్ట మీద ప్రాకృతిక శిలాస్తంభాల (కాలమ్నార్ బసాల్ట్స్)ను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. తెలంగాణలో ఇలాంటి శిలారూపాలు కనిపించడం ఇది రెండోసారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారు, జీఎస్సై రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ పేర్కొన్నారు. అపురూపమైన ఈ శిలాలను పరిరక్షించి, స్మారక కట్టడంగా ప్రకటించాలని కోరారు. 2015లో తొలిసారి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో బసాల్ట్ శిలాస్తంభాలను గుర్తించారు.
తాజాగా కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు తిరుపతి గిత్తే, మిత్రబృందంతో కలిసి బోర్లాల్గూడలోని రాతిస్తంభాలను ఆదివారం వెలుగులోకి తెచ్చారు. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భం నుంచి పైకి ఎగిసి ప్రవహించిన లావా.. మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో లావా శిలలుగా ఏర్పడిందని భూవైజ్ఞానికవేత్తలు చెప్తుంటారు. వీటినే కాలమ్నార్ బసాల్ట్స్గా పిలుస్తున్నారు. గతంలో వీటిని మధ్యప్రదేశ్లోని కాన్వాడ పహాడ్, పలాసి, మానవార్, కోటెడల ప్రాంతాలు, గుజరాత్ రాష్ట్రం అంజర్కచ్లోని ధీమాధర్, మహారాష్ట్రలోని అంధేరి గిల్బర్ట్హిల్, కొల్హాపూర్, ఉస్మానాబాద్, బీడ్ చించోలిలో గుర్తించారు. బోర్లాగ్గూడలోని కలమ్నార్లు బీడ్ చించోలి స్తంభాలను పోలి ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పేర్కొన్నది.