హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగుసార్లు రాళ్ల దాడి జరిగిందనీ, ఇలాంటి వాటికి భయపడేది లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడి ఇంటిపైనే దాడి జరిగితే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? దేశంలో రక్షణ ఉన్నదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఘటనపై ఎంపీ పీఏ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై అసదుద్దీన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు ముస్లింల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తున్నారని, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, రాళ్ల దాడి గురించి తనకెలాంటి భయం లేదని చెప్పారు. బీజేపీ నేతల ఇంటిపై ఇలాంటి దాడి జరిగి ఉంటే దేశవ్యాప్తంగా గొడవలు సృష్టించేవారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు దేశానికి ఏమాత్రం మంచిది కాదని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటూనే.. మరోవైపు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక శిక్షలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ ఘటనలపై స్పందించాలని, ఎన్నికల ముందు ఆయనకు ఇదే చివరి ప్రసంగం కాబోతున్నదని పేర్కొన్నారు.