హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే విషయం అవగతమవుతున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై సకాలంలో హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఒక వైపు బకాయిలు విడుదల చేయకపోవడం, మరో వైపు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే పరిస్థితిని సాక్షాత్తు సర్కారే కల్పించడం ఆందోళనకరమని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సర్కార్కు విద్యార్థుల సత్తాచూపుతామని ఆయన హెచ్చరించారు.
మన విద్యను మనమే కించపరుచుకోవడమా..?: పీటీఏ టీజీ
మన ప్రభుత్వ విద్యను మనమే కించపరిస్తే ఎట్టా ..? అని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రశ్నించింది. సీఎం వ్యాఖ్యలు ఉపాధ్యాయుల ఆత్మైస్థెర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే మల్లికార్జున్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే శారద, అదనపు ప్రధాన కార్యదర్శి మేడే దేవదాస్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్లో నెలకు రూ. 3-4వేలే ఫీజులున్నాయన్న సీఎం వ్యాఖ్యలను ఖండించారు. ఏవీఎన్ స్కూల్లో ఎల్కేజీకి రూ. 2లక్షలు, ఇవేకాకుండా డొనేషన్స్, ట్రాన్స్పోర్ట్ స్పెషల్ ఫీజుల పేర లక్షలు గుంజుతున్నారని ఆరోపించారు.
సీఎం విద్యామంత్రి హోదా నుంచి తప్పుకోవాలి : భుజంగరావు
ప్రభుత్వ విద్యను పాడెక్కించిన సీఎం రేవంత్రెడ్డి, విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎస్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బచ్చు భుజంగరావు డిమాండ్ చేశారు. సర్కార్ బడుల్లో లక్షలు ఖర్చుచేస్తున్నా పిల్లలకు చదువురావడంలేదని చెప్పడమంటే విద్యాశాఖ మంత్రి వైఫల్యం చెందినట్టేనని అభిప్రాయపడ్డారు. తన వైఫల్యాన్ని అంగీకరించి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాకమిషన్, విద్యాశాఖ మంత్రులంతా కలిసి ప్రభుత్వ విద్యకు చావుడప్పు కొట్టి పాడెనెక్కించడం ఆందోళనకరమని వాపోయారు.