హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సమగ్ర అభివృద్ధికి నిష్పక్షపాతంగా కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు సైతం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. ఎన్నో దశాబ్దాల అణచివేతకు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ఆదివాసీలు, గిరిజనులు, బంజారాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోటాను పెంచింది. వారి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి రూ. 75,450 కోట్లు కేటాయించింది. ఇందు లో ఇప్పటివరకు రూ. 47,258 కోట్లను ఖర్చుచేసింది. గిరిజన గూడేలను, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలోని 3,146 తండాలు, గూడేలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిం ది. ఆ పంచాయతీల్లో రూ. 1,837.08 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు ఎస్టీఎస్డీఎఫ్ కింద ప్రత్యేక నిధులను ఈ సంవత్సరం కేటాయించింది.
ఆదివాసీ యోధుడు కుమ్రం భీం, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. మేడారం జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నది. నాగోబా, జంగుబాయి, బరంపూర్, ఎరుకల నాంచారమ్మ, గాంధారి మైసమ్మ వంటి జాతరలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఇందుకోసం రూ. 354 కోట్లు ఖర్చు చేసింది. ఆదివాసీ హకుల కోసం పోరాడిన కుమ్రం భీం స్మారక కేంద్రాన్ని, గోండుల సంస్కృతిని తెలిపే మ్యూజియాన్ని ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలోని జోడేఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాను కుమ్రంభీం జిల్లాగా నామకరణం చేయటం తెలిసిందే. మేడారం దగ్గర రూ. 22.53 కోట్లతో సమ్మక సారలమ్మ మ్యూజియం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ఆదివాసీ బంజారాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా సుమారు రూ.50 కోట్లతో ఆదివాసీ భవన్, బంజారా భవనాన్ని నిర్మించగా.. ఈ నెల 17న సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.