రాజన్న సిరిసిల్ల, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు స్థిరమైన ఆదాయం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నదని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత జౌళిశాఖ కార్యాలయంలో సోమవారం రూ.330 కోట్ల బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్ కాపీలను 136 మాక్స్ సంఘాలు, 126 ఎస్ఎస్ఐ సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం ముందే ఇచ్చినట్టు తెలిపారు. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారని చెప్పారు. సెప్టెంబర్ చివరిలోగా చీరలు తయారు చేసేలా ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సిరిసిల్ల మరమగ్గాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2758 కోట్ల వస్త్ర ఆర్డర్లు ఇచ్చిందని వివరించారు. ఈసారి 525 డిజైన్లతో మగువలు మెచ్చేలా అనేక రంగుల్లో తయారు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. ఇంత పెద్ద ఎత్తున సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వడంపై ఆయన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.