TSRTC | హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలకు ఓ భరోసా అందించాలనే ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చివరి అంకానికి చేరింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీ చేసిన చట్టాన్ని తక్షణమే అమలుచేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రవాణాశాఖ అధికారులు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే ‘అపాయింటెడ్ డేట్’ను ఖరారు చేయాలని నిర్ణయించారు. అపాయింటెడ్ డేట్ను ఖరారుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీనుంచే ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.
రాష్ట్రంలోని 43 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలకు ఓ శాశ్వత భరోసాను కల్పించేందుకు ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఒక బిల్లును గత జూలై 31న రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించగా, ఆగస్టు ఆరున అసెంబ్లీ కూడా ఆమోద ముద్ర వేసింది. దీనిపై సెప్టెంబర్ 15న న్యాయశాఖ ద్వారా గెజిట్ పబ్లికేషన్ వెలువడింది. ఈ చట్టం అమలు తేదీ(అపాయింట్ డేట్)ని ఖరారుచేస్తూ రవాణాశాఖ పరిపాలనా విభాగం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన సమయంలో అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో విలీన ప్రక్రియ చివరిదశలో నిలిచిపోయింది.
తొలుత రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుపై కొర్రీలు వేస్తూ జాప్యం చేసినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేయడంతో ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలో విలీన ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ రూపంలో ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నానికి మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలకు ఓ భరోసా అందించాలనే ఉద్దేశంతో నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటినుంచీ పలు రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయానికొచ్చింది.
ఇప్పటికే అసెంబ్లీలో చట్టం అయినందున అపాయింటెడ్ డేట్ ఖరారు చేసేందుకు ఎన్నికల నియమావళి అడ్డంకి కారాదని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ఈ అంశంపై ఎన్నికల కమిషన్ సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని యూనియన్ అధ్యక్షుడు ఆర్కే రెడ్డి, ప్రథాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదయ్య తదితరులు విజ్ఞప్తిచేశారు.