వరంగల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమవడంతో బీజేపీకి భయం పట్టుకున్నదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని విమర్శించారు. కేంద్రం కక్షపూరిత చర్య లు బీజేపీ పతనానికి నాంది అని పేర్కొన్నారు. ఈడీ, బోడీలను అడ్డుపెట్టుకొని బీజేపీ ఎన్ని వేసాలు వేసినా వాటిని తెలంగాణ తిప్పికొడుతుందని చెప్పారు.