Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ)ను అమలుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవి సెలవుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాయిదావేశారు. జూన్ రెండో వారం నుంచి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తారు. 15 ఏండ్లు నిండిన నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. నిరక్షరాస్యులు, డ్రాపౌట్లను వారి వయస్సు, విద్యార్హతలను బట్టి చదువుకునేలా ప్రోత్సహిస్తారు.
ఓపెన్స్కూల్, దూరవిద్య ద్వారా వారి అభిరుచుల మేరకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేర్పిస్తారు. గతంలో సాక్షరభారత్ పథకాన్ని అమలుచేశారు. ఈ పథకం కోసం వలంటీర్లను నియమించి కొంత పారితోషికం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు పారితోషికం ఇవ్వకుండా స్వచ్ఛందంగా పనిచేసే వలంటీర్ల సేవలను వినియోగించుకుంటారు. అంగన్వాడీ టీచర్లు, సెల్ప్హెల్ప్ గ్రూపులు, టీచర్లు, విద్యార్థులు, వలంటీర్ల సహాయాన్ని తీసుకుంటారు. ఎన్ఐఎల్పీ కార్యక్రమ అమలు బాధ్యతలను జిల్లా విద్యాశాఖాధికారులకు అప్పగించారు. జిల్లాస్థాయిలో డీఈవోలు, క్షేత్రస్థాయిలో విద్యాశాఖలో పనిచేసే టీచర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఉన్నత పాఠశాలలు కేంద్రంగా ఆయా పాఠశాల పరిధిలో అక్షరాస్యతా పెంపు కార్యక్రమాలను అమలుచేస్తారు. ఒక పాఠశాల హెచ్ఎం లిట్రసీ సూపర్వైజర్గా, ఇద్దరు టీచర్లల్లో ఒకరు లిట్రసీ టీచర్గా, మరొకరు సర్వేయర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయా టీచర్ల ఎంపికకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తికాగానే, ఎన్నికల కోడ్ ముగియగానే ‘న్యూ ఇండియా లిట్రసీ ప్రోగ్రామ్’ను అమలుచేస్తారు.