ఆర్మూర్, ఫిబ్రవరి 18: తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడికి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా కిసాన్ విజయోత్సవ సమితి సంస్థ ‘కిసాన్ రత్న’ అవార్డును ప్రకటించింది. ఈ నెల 28న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కోటపాటిని కిసాన్త్న్ర అవార్డుతో సన్మానించనున్నది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొన్న నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించాలని కిసాన్ విజయోత్సవ సమితి సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు నాయకులను అవార్డులతో సన్మానించనున్నారు. తెలంగాణ నుంచి ఈ అవార్డుకు కోటపాటి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ.. వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరించుకొనేలా రైతులు చేసిన పోరాటాలకు గుర్తింపుగా అవార్డులివ్వడం ఆనందంగా ఉన్నదన్నారు. తనకు కిసాన్త్న్ర అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. పోరాటంలో అమరులైన 750 మంది రైతులకు తన అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నర్సింహనాయుడిని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.