రామంతాపూర్, నవంబర్ 27: రాష్ట్రంలోని 32 లక్షల మంది గౌడ కులస్థులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కారు గుర్తుకే ఓటేస్తారని గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత రామంతాపూర్లో సోమవారం గౌడసంఘం నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడల అభ్యున్నతికి విశేషంగా పాటుపడుతున్నదని తెలిపారు.
గౌడ వృత్తిదారులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. ప్రతి ఏటా కల్లు గీత వృత్తిదారులు చెల్లించే 20 కోట్ల రెంటల్స్ మాఫీ చేసిందని, సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, నాడు కాంగ్రెస్ సర్కారు కల్లు దుకాణాలను మూసి వేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 103 కల్లు సొసైటీలను తెరిపించిందని, 30 అడుగుల పాపన్న భారీ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని వివరించారు.
హైదరాబాద్ నడిబొడ్డున నీరా కేఫ్ను ఏర్పాటు చేశారని, కల్లుగీత కార్మికులకు బీమా తీసుకొచ్చారని, గౌడ కులస్థుల ఆత్మగౌరవం కోసం కోకాపేటలో భవనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఇచ్చారని, వైన్ షాపుల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించారని చెపపారు. కల్లు గీత కార్మికుల మరణాలను అరికట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీహార్ నుంచి పొట్టి తాటి మొక్కలను తెప్పించిందని, కార్మికుల సేఫ్టీ కోసం మోకులు, మోపెడ్స్ను ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తమ అభ్యున్నతికి ఇన్ని చేసిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలోని గౌడ కులస్థులకు పిలుపునిచ్చారు. ఉప్పల్లో ఉన్న గౌడ సోదరులు బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌడ సంఘం ప్రతినిధులు పాలకూర దాసుగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకూర శ్రీకాంత్గౌడ్, నేమూరి శ్రీకాంత్గౌడ్, నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.