హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలకు నిధులను విడుదల చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నారని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్కే పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. కేంద్ర నిధుల్లో అత్యధిక భాగాన్ని గుజరాత్కే ఎందుకు విడుదల చేస్తున్నారని మోదీని ప్రశ్నించారు. గత 17 నెలల్లో కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు రూ.1,37,655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు మంజూరు చేసిందని వినోద్కుమార్ గుర్తుచేశారు.
ప్రధానిగా దేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన బాధ్యత మోదీపై ఉన్నప్పటికీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి కోసమే ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించారని ధ్వజమెత్తారు. నిధుల విడుదలలో ఇతర రాష్ర్టాల పట్ల వివక్ష చూపడం ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదని హితవు పలికారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రజలు ఓటు వేస్తేనే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని, అలాంటప్పుడు రాష్ర్టాల్లోని ప్రజా ప్రభుత్వాలను కేంద్రం ఎలా విస్మరిస్తుందని నిలదీశారు. మోదీ ఏకపక్ష విధానాలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, ఆయనతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని వినోద్కుమార్ పేర్కొన్నారు.