తెలంగాణచౌక్, మార్చి 26: దేశంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సీసీఎం చేపట్టిన జనచైతన్య యాత్ర ఆదివారం కరీంనగర్కు చేరుకున్నది. ఈ సందర్భంగా కోతిరాంపూర్లోని అన్నమనేని గార్డెన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు.
అధికార దురహంకారంతో వీర్రవీగుతున్న మోదీకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన జనతా పార్టీని నిరంకుశ పాలన కొనసాగిస్తే చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ప్రజలు ఓటేసే ముందు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ఓటేయాలని మోదీ పిలుపునిచ్చారని, మరి ఇప్పడు సిలిండర్ ధర రూ.1200లకు చేరిందని, దీని గురించి మోదీ ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్ర మంచి కార్యక్రమమని అభినందించారు. ప్రజాస్వామ్యవాదుల యాత్రకు మద్దతివ్వాలని సీపీఎం నాయకుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.