హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): నిమ్స్ను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా రూ.48 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. ఇందులో రూ. 31.5 కోట్ల విలువైన అత్యాధునిక రోబో కూడా ఉండటం గమనార్హం. మిగతా వాటిలో రూ. 16.5 కోట్ల విలువైన సర్జికల్ న్యూరో, సర్జికల్ యూరాలజీ విభాగాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ పరికరాలతో అన్ని రకాల శస్త్రచికిత్సలతోపాటు న్యూరో, స్పైన్, క్యాన్సర్, గ్యాస్ట్రో, యూరాలజీకి సంబంధించిన ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చేసే వీలుంటుంది. అందుబాటులోకి వస్తున్న రోబో యంత్రం ద్వారా కోత లేకుండా చిన్నపాటి రంధ్రాల ద్వారా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సులభంగా పూర్తిచేయవచ్చు. రోబో సర్జరీ వల్ల రోగికి రక్తస్రావం జరగదని, ఫలితంగా ఆపరేషన్ సమయంలో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదని డాక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ చరిత్రలోనే ఇది ఖరీదైన యంత్రమని, దీనిని సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంత అత్యాధునిక రోబో కార్పొరేట్ దవాఖానల్లోనూ లేదని తెలిపారు. యూరినరీ బ్లాడర్, రెక్టమ్ క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సలకు ఇది బాగా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ రోబోతో చేసే ఆపరేషన్ల కచ్చితత్వం, సక్సెస్రేట్ 90 శాతానికిపైగానే ఉంటుందని, ఇన్ఫెక్షన్లకు తావుండదని పేర్కొన్నారు.