హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక ‘నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (ఎన్జీఎస్) సాంకేతికతతో కూడిన క్యాన్సర్ జీనోమిక్స్ ల్యాబ్ను నిమ్స్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఒకేసారి 52 జన్యు మార్పులను (మ్యుటేషన్లను) అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, రోగికి అనుకూలమైన చికిత్సను నిర్ణయించే అవకాశం కలుగుతుందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప వెల్లడించారు.
ఎన్జీఎస్కి సంబంధించిన ట్రయల్స్ను నెలరోజుల క్రితం ప్రారంభించి 28 మంది రోగులకు పరీక్షలు నిర్వహించామని, అవి విజయవంతమవడంతో ప్రస్తుతం ఊపిరితిత్తుల (లంగ్) క్యాన్సర్ రోగుల కోసం ప్రారంభించామని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతివీర్ తెలిపారు. భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, బ్లడ్ క్యాన్సర్లు సహా అన్ని రకాల క్యాన్సర్ రోగులకు ఈ సేవలను విస్తరిస్తామని చెప్పారు. జీనోమిక్ పరీక్షల్లో గుర్తించే మ్యూటేషన్ల ఆధారంగా ఎవరికి ఏ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఒకే రకమైన క్యాన్సర్ ఉన్న ఇద్దరు రోగుల్లో జన్యు మార్పులు భిన్నంగా ఉండే అవకాశం ఉంటుందని, అందువల్ల చికిత్స కూడా వ్యక్తిగతంగా మారుతుందని తెలిపారు.
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఎన్జీఎస్ ప్రాజెక్ట్ను ప్రారంభించిదని, వాటిలో తమ దవాఖాన ఒకటని, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు కలిపి ప్రారంభించిన ఈ ల్యాబ్లో ప్రస్తుతం నెలలో 30 మందికి ఎన్జీఎస్ పరీక్షలు నిర్వహించే వీలున్నదని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప వివరించారు. ప్రైవేటు దవాఖానల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ పరీక్షలను అర్హులైన రోగులకు నిమ్స్లో పూర్తి ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు.