హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్నైకి తాగునీటిని కండలేరు రిజర్వాయర్ నుంచే సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. చెన్నై తాగు నీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టుపై అదనంగా మరో లిఫ్ట్ను ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ సూచనను తెలంగాణ తిరస్కరించింది. శ్రీశైలంపై మరో లిఫ్ట్ ఏర్పాటునకు అంగీకరించేది లేదని స్పష్టంచేసింది. చెన్నైకి తాగునీటి సరఫరా అంశంపై కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో కూడిన ప్రత్యేక కమిటీ సమావేశం గురువారం వర్చువల్గా కొనసాగింది. ఒప్పందం మేరకు చెన్నైకి మరో 6 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉన్నదని, దానిని విడుదలచేయాలని తమిళనాడు ఈఎన్సీ కోరారు. దీనిపై ఏపీ స్పందిస్తూ.. ఆ నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకోవాలని తమిళనాడుకు సూచించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. శ్రీశైలం నుంచి కండలేరు రిజర్వాయర్కు ఇప్పటికే పరిమితికి మించి నీటిని తరలించారని, ఆ నీటిని చెన్నై తాగునీటి కోసం ఇవ్వాలని తెలంగాణ సర్కారు నొక్కిచెప్పింది. చెన్నైకి తాగునీటి కోసం కండలేరు నుంచి పూండి రిజర్వాయర్ వరకు నిర్మించతలపెట్టిన పైప్లైన్కు సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేస్తే, పరిశీలించి నిర్ణయం చెప్తామని తెలంగాణ ప్రభుత్వం తమిళనాడుకు స్పష్టంచేసింది. చెన్నైకి తాగునీటి సరఫరా పర్యవేక్షణ మాదిరిగానే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై కూడా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ కేటాయించిన 15.92 టీఎంసీల్లో 5 టీఎంసీలు కూడా రావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. సమావేశ మినిట్స్లో ఈ అంశాలను చేర్పించింది. సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలమండలి సీఈ మోహన్కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు పాల్గొన్నారు.