హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. వానకాలంలో రాష్ట్రంలో వరి దిగుబడి ఎంత వచ్చినా తీసుకొంటామని కేంద్ర మంత్రులు పీయూష్గోయల్, కిషన్రెడ్డి పదేపదే చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని గట్టిగా డిమాం డ్ చేస్తున్నది. ఈ విషయాన్ని తేల్చుకొనేందుకు మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రమంత్రుల అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సోమవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ను కలవాలని నిర్ణయించారు. వానకాలం పంటను ఎంతైనా కొంటామన్న ప్రకటనపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం చేతులెత్తేస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నది. దీంతో ముందుగానే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరనున్నారు. అదేవిధంగా ఏడాదికి ఎంత ధాన్యం తీసుకొంటారో టార్గెట్ ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేయనున్నారు.
కేంద్రం టార్గెట్కు మించి ధాన్యం
ప్రస్తుత వానకాలం సీజన్లో రాష్ట్రం నుంచి 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 90 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. కేంద్రం ఇచ్చిన 60 లక్షల టన్నుల టార్గెట్ సేకరణ నేడోరేపో పూర్తికానున్నది. మరో 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నది. ధాన్యం సేకరణను పెంచాలని రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రమంత్రిని కలిసి 90 లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేయటంతో ఎంత దిగుబడి వచ్చినా తీసుకొంటామని కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు హామీ ఇవ్వడం లేదు. మిగులు ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అందువల్లనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీలో మరోసారి కేంద్రాన్ని నిలదీసే పనిని వేగవంతం చేసింది.