హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను అక్రమంగా ఇరికించారని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ కోర్టు తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే డిశ్చార్జి పిటిషన్ను కొట్టివేసిందని పేర్కొంటూ ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ జరిపారు. తొలి చార్జిషీట్లో సబితను సాక్షిగా పేర్కొన్న సీబీఐ.. అదనపు చార్జిషీట్లో నిందితురాలిగా పేర్కొనడం సరికాదని, దీన్ని కొట్టివేయాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన పాపానికి సబితను నిందితురాలిగా చేర్చడం అన్యాయమన్నారు. నాడు గనుల శాఖ ప్రతిపాదనలకు మంత్రిగా సబిత ఆమోదం తెలిపారని, ఇతర వ్యవహారాల్లో ఆమెకు ఎలాంటి పాత్ర లేదని తెలిపారు. దీంతో ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.