Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి పొంగులేటి తన సహచర మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 15 రోజుల క్రితం తనపై శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు చేసిన నిర్దిష్టమైన ఆరోపణలపై ప్రభుత్వంలోని తన సహచర మంత్రులెవ్వరూ సరిగ్గా స్పందించలేదన్న ఫ్రస్ట్రేషన్ పొంగులేటిలో కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సహచర మంత్రులెవరైనా తనకు మద్దతుగా మాట్లాడుతారని 15 రోజులుగా ఎదురుచూసిన ఆయన.. చివరికి తానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. మంత్రివర్గంలో ఉన్నప్పుడు తనకు సహచరుల నుంచి మద్దతు లభిస్తుందని పొంగులేటి భావించారు. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు మద్దతుగా రాకపోవడంతో ఆయన ఖిన్నుడైనట్టు మంత్రి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడుగా తనపై ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం తరఫున ఏదో మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు మాట్లాడారని, అయితే, అది తనను రక్షించినట్టుకాకుండా ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పారని, మొక్కుబడి తంతుగా ముగించారని మంత్రి పొంగులేటి రెడ్డి అనుచరులు వాపోతున్నారు.
ఎవరేమిటో చూసేందుకే తమ నాయకుడు 15 రోజులు వేచి చూశారని, 15 రోజులుగా బీఆర్ఎస్ నుంచి దాడి పెరుగుతూనే ఉన్నదని, తనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, వీటిపై ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పే అవకాశం ఉన్నా తనను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదని పొంగులేటి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అందరి గెలుపు కోసం డబ్బు ఖర్చు పెట్టుకున్నానని, ఇంత చేసినా తనకు అండగా ఎవ్వరూ రాకపోవడం బాధించిందని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ రోజురోజుకూ పదునెక్కిన ఆరోపణలు చేయడం, సాక్ష్యాలు సహా బయటపెడుతుండటంతో తాను పలుచనయ్యానని ఆయన ప్రభుత్వంలోని ఒకరిద్దరు ముఖ్యనేతలతో పేర్కొన్నట్టు సమాచారం. ఎవరూ తనకు మద్దతుగా రాకపోవడంతో తీవ్రంగా రగిలిపోయిన మంత్రి పొంగులేటి ఇక తానే తేల్చుకుంటానని, ఏదో ఒకటి ఇప్పుడు మాట్లాడకపోతే తన ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నేతలతో అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఇన్నేసి డాక్యుమెంట్లు బీఆర్ఎస్కు ఎలా చేరాయని, ఓవైపు తనకు మద్దతుగా ఎవ్వరూ రాకపోవడం, బీఆర్ఎస్ సాక్ష్యాలన్నింటిని ముందు పెట్టి రోజుకో అవినీతి బాగోతాన్ని బయటపెడుతుండటంతో పొంగులేటి తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురైనట్టు కనపిస్తున్నది.
మంత్రి పొంగులేటి క్రషర్పై మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో మాట్లాడిన మంత్రులే తనను ఇరికించారన్న భావన పొంగులేటిలో వ్యక్తమవుతున్నది. ఉద్దేశపూర్వకంగా తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని ఒప్పుకొన్నారని, ఇలా ఒప్పుకోవడంతో ఇప్పుడు తాను క్రషర్ అంశంలో గట్టిగా ముందుకు వెళ్లలేకపోతున్నారని పొంగులేటి సన్నిహితులు చెప్తున్నారు. విచారణ చేయిద్దామంటూ సవాళ్లు విసరడంతో అంశం మరింత పెద్దదైందని, నాదర్గుల్ భూముల విషయంలోనూ ప్రభుత్వం అధికారులతో మాట్లాడిస్తే అయిపోయేదని, కానీ, అలా జరగలేదని, తన శాఖనే కావడంతో తాను అధికారులకు ఏమీ చెప్పలేకపోయాడని పొంగులేటి అనుచరవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటు అధికారులపై, అటు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఆయన బుధవారం విలేకరుల సమావేశం పెట్టారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి.

నాదర్గుల్ భూముల అవినీతి బండారం గత కొన్నిరోజులుగా వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విషం చిమ్మారు. బుధవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో గుమస్తా తెలంగాణ అంటూ చిందులు తొక్కారు. తెలంగాణ ప్రజల గొంతుకగా ముందుకెళ్తున్నందుకు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, భూ కబ్జాలను ప్రజల చెంతకు తీసుకెళ్తున్నందుకు నోటికి పని చెప్పారు. ‘నమస్తే’ కథనాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన మంత్రి పొంగులేటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. నాలుగుసార్లు నమస్తే తెలంగాణ పత్రిక ప్రతిని చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు.