హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నదని, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. అమిత్ షా ఇటీవల కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించడాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కఠోరమైన అసత్యాలు మాట్లాడటం ఆయన హోదాకు తగదని చురకలంటించారు. గత సెప్టెంబర్ 17న జరిగిన కార్యక్రమాలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు, ఫొటోలను అమిత్షాకు షేర్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ఎందుకు జరపడం లేదని ప్రశ్నించేవారు, ఆగస్టు 15ను స్వాతంత్య్ర దినంగా ఎందుకు జరుపుతున్నారు? ఆ రోజును కూడా విమోచన దినంగా జరపవచ్చు కదా’ అని నిలదీశారు. ‘ఇంకా గతకాలపు జ్ఞాపకాలలో బంధీగా ఉండటం మాని.. భవిష్యత్తుకు రూపకర్తగా మారండి’ అంటూ చురకలంటించారు. శంషాబాద్లో శిథిలావస్థలో ఉన్న ఓ భవనాన్ని కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్రెడ్డిని మంత్రి కేటీఆర్ ‘వెల్డన్’ అంటూ అభినందించారు.