Singareni | సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణహిత చర్యలకు రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు అవార్డును అందించారు.
సంస్థ తరఫున చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథ రాజు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత వస్తువుల ప్రదర్శనను మంత్రులు ఆద్యంతం తిలకించారు. అనంతరం కాలుష్య, ప్లాస్టిక్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న వివిధ శాఖల అధికారులు, సంస్థలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, బహుమతులను అందజేశారు. సింగరేణి అధునాతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ పర్యావరణహిత మైనింగ్ పద్ధతులకు మొదటి నుంచి పెద్దపీట వేస్తోంది.
అంతేకాకుండా ఓవర్ బర్డెన్ డంప్లపై పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే 5.71 కోట్ల మొక్కలు నాటింది. అలాగే పర్యావరణ హిత చర్యల్లో భాగంగా కంపెనీ ఇంధన అవసరాలను సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున సోలార్ ప్లాంట్లను నెలకొల్పుతూ ముందుకు వెళ్తున్నది. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రంలోనూ కొత్త పర్యావరణహిత నియమావళికి అనుగుణంగా ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ లాంటి కొత్త ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తూ పర్యావరణ హితంగా థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నది.