బీజేపీ కార్యకర్త: సార్.. ప్రచారానికి పోతే మీ ఎజెండా ఏదని ప్రజలు అడుగుతున్నారు. మన మ్యానిఫెస్టో ఎప్పుడు?.
రాష్ట్ర నాయకులు: ‘త్వరలో..’ విడుదల చేస్తాం.
బీజేపీ నాయకుడు: అన్నా.. ఎవరి పేరుచెప్పి ఓటు అడగాలో తెలియని పరిస్థితి. అభ్యర్థుల జాబితా ఏదన్నా?.
రాష్ట్ర నాయకత్వం: త్వరలో వస్తుంది.
బీజేపీ నేత: అన్నా.. పార్లమెంటరీ బోర్డు సమావేశం అయ్యిందా? మన లిస్ట్ను ఒప్పుకుందా?
రాష్ట్ర నాయకత్వం: త్వరలో సమావేశం అవుతుంది.
బీజేపీ అభిమాని: సార్.. పొత్తులేమన్నా ఉంటాయా? ఒంటరిగా పోతున్నామా?
రాష్ట్ర నాయకత్వం: త్వరలో స్పష్టత వస్తుంది.
హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, మ్యానిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ.. సెంచరీ కొట్టేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ 55 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి, ఆరు గ్యారంటీలంటూ ఏదో హడావుడి చేస్తున్నది. వాటినే పట్టుకొని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు.
మంగళవారం బీఎస్పీ కూడా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కానీ.. బీజేపీలో మాత్రం వింత వైఖరి కనిపిస్తున్నదని పార్టీ నేతలు వాపోతున్నారు. ఇతర రాజకీయ పార్టీలన్నీ పరుగుల పోటీలో ఉన్నట్టు దూసుకెళ్తుంటే.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికలతో సంబంధమే లేనట్టు, వచ్చే ఏడాదో, రెండేండ్ల తర్వాతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి బీజేపీ అభ్యర్థుల జాబితాను ఈ నెల మొదటివారంలో విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత దానిని రెండో వారానికి, ఆ తర్వాత 15వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ‘త్వరలో’ అని మాత్రమే చెప్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసమే ఇలా ఆలస్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచీ 119 నియోకవర్గాల్లో నిలబడేందుకు అభ్యర్థులు లేరన్నది అందరికీ తెలిసిందే. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చే నేతల కోసం ఎదురుచూసింది.
బీఆర్ఎస్లో అభ్యర్థులను ప్రకటించినా అసమ్మతి తలెత్తలేదు. కాంగ్రెస్లో మాత్రం అసమ్మతి భగ్గుమంటున్నది. ఆ అసమ్మతి నేతలంతా బీజేపీలో చేరుతారని రాష్ట్ర నాయకత్వం ఆశపడింది. కానీ వారిలో అత్యధికులు బీఆర్ఎస్లో చేరుతుండటంతో బీజేపీకి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. కాంగ్రెస్లో రెండో జాబితా విడుదల చేసిన తర్వాత మరికొందరు నేతలు వస్తారనే ఆశతోనే బీజేపీ ఇంకా జాబితాను విడుదల చేయడం లేదని పేర్కొంటున్నారు. బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సమావేశం వరుసగా వాయిదా వేస్తున్నారు. బుధవారం ఉంటుందని నేతలు చెప్తున్నా, సమావేశం జరిగేది అనుమానమేనని సమాచారం. దీంతో ఏం చేయాలో అర్థం కాక బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది.