Kaleshwaram | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్లు రాలేదంటూనే… హడావిడిగా నివేదిక తయారు చేస్తుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ డాక్యుమెంట్లను పంపిన రోజునే నివేదిక కూడా కాపీ సిద్ధం చేస్తుంది.. ఇదంతా పరిశీలిస్తే కాళేశ్వరం ఎత్తిపోతలపై జరుగుతున్న కుట్ర ఏందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇతర రాష్ర్టా ల్లో డ్యాంలు కూలిపోతున్నాయని ప్రజలు నెత్తీనోరు మొత్తుకున్నా కుంభకర్ణుడిగా గుర్రుపెట్టిన నిద్రపోయిన డ్యాం సేఫ్టీ అథారిటీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చూపుతున్న ఆసక్తి, వేగం చూసి ఇంజినీరింగ్ నిపుణులే ముక్కున వేలేసుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించకుండానే నివేదిక ఇచ్చినట్టు ఉన్నదని విస్మయం వ్యక్తంచేస్తున్నారు. లోపం తలెత్తిన వారం రోజుల్లోపే సమగ్ర అధ్యయనం లేకుండా తుది తీర్పు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్తున్నారు.
గత నెల 22న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కేంద్రానికి కాళేశ్వరంపై లేఖ రాశారు. మరుసటి రోజే (23వ తేదీన) నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) బృందం రంగంలోకి దిగింది. 24వ తేదీన మేడిగడ్డ వద్దకు వెళ్లిన ఎన్డీఎస్ఏ ఇంజినీర్ల బృందం, బరాజ్ మీదకు వెళ్లింది. అక్కడ రెండు గంటల పాటు ఉండి, స్థానిక ఇంజినీర్ల నుంచి పలు వివరాలు సేకరించింది. 25వ తేదీన జలసౌధలో తెలంగాణ సాగునీటి రంగ ఇంజినీర్లతో దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమై పలు సాంకేతిక అంశాలపై చర్చించి, కొన్ని డాక్యుమెంట్లు తీసుకొన్నది. 20 అంశాలపై ఎన్డీఎస్ఏ బృందం వివరాలు కోరగా… అప్పటికప్పుడు తెలంగాణ ఇంజినీర్లు రెండు అంశాలకు సంబంధించి నివేదికలు ఇచ్చి, మిగిలిన వాటిని సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కానీ ఎలాంటి సమయం ఇవ్వకుండానే 29వ తేదీలోగా కోరిన నివేదికలు ఇవ్వకపోతే… అందుకు సంబంధించిన సమాచారం లేదని భావించి, తుది నివేదిక ఇస్తామని 26వ తేదీనాడే ఎన్డీఎస్ఏ తెలంగాణకు లేఖ రాయడం గమనార్హం. అయితే 29వ తేదీ నాడు కొన్ని… నవంబర్ ఒకటిన మరికొన్ని… ఇలా బృందం కోరిన 20 అంశాలకుగాను 17 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది.
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేంద్ర జల సంఘం చైర్మన్ సహా అనేక మంది ఉన్నతాధికారులు వచ్చి అన్ని అంశాలను పరిశీలించి ప్రాజెక్టును ఎంత పొగిడి పోయారో తెలంగాణ ప్రజలు మరచిపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును వారు ఇంజినీరింగ్ వండర్గా వర్ణించి పోయారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నది గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యాం సేఫ్టీ అథారిటీ వారే నివేదికలో పేరొన్నారు. దురదృష్టకర సంఘటన జరిగినా బరాజ్ కుంగిపోకుండా సాగునీటి శాఖ ఇంజినీర్లు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ఇటువంటి పనులు గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతాయి. దేశంలో అనేక బరాజ్ల నిర్మాణంలో రాఫ్ట్ ఫౌండేషన్ వినియోగించారు. వాటి డిజైన్లకు సంబందించి కోడ్స్ను, మాన్యువల్స్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలే జారీ చేశాయి. గంగా నదిపై నిర్మించిన ఫరకా బరాజ్, గోదావరిపై నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ బరాజ్, కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బరాజ్లో కూడా ఇటువంటి పిల్లర్ల కుంగుబాటు ఘటనలు జరిగాయి. వాటిని ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంజినీర్లు సమర్థవంతంగా పునరుద్ధరించారు.
పేజీ 1: నివేదికలోని మొదటి పేజీలో “ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.”అని పేర్కొన్నారు. ఇథమిద్ధంగా కారణాన్ని చూపలేకపోయారు.
పేజీ 2: నివేదికలోని రెండో పేజీలో “ఖాళీలు బహుశా సృష్టించబడి ఉండవచ్చు.” అని సందేహాస్పదంగా భావం వ్యక్తపరిచారు.
పేజీ 2: నివేదికలోని రెండో పేజీలోనే “కానీ పాటించలేనట్లుగా ఇది కనిపిస్తోంది.” అని పేర్కొన్నారు.అడిగిన సమాచారం ఇవ్వకపోతే పాటించనట్లేనా?
పేజీ 3: నివేదికలోని మూడో పేజీలో “అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులూ ఇటువంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే కలిగి ఉన్నాయి.” అని పేర్కొన్నారు. దేశంలోని 6 వేల ప్రాజెక్టుల్లో ఇటువంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులను కలిగి ఉన్న డ్యామ్లన్నీ ఇంతేనా?
1979లో భారీ వర్షాలతో గుజరాత్లోని మోర్బీ జిల్లా అతలాకుతలమైంది. మచ్చు నదికి వరద పోటెత్తింది. దీంతో మచ్చు డ్యామ్ తెగిపోయింది. ప్రాజెక్టు కిందనున్న ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. మొత్తంగా 25 వేల మంది మరణించారు. దేశంలోనే అత్యంత భయానక దుర్ఘటన అంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ కూడా అభివర్ణించింది. దుర్ఘటన జరిగి 44 ఏండ్లు గడిచింది. అయితే ఈ దుర్ఘటనపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)గానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)గానీ ఇప్పటివరకూ ఎలాంటి సమగ్ర నివేదికను సమర్పించలేదు.
కేరళలోని ముల్లపెరియార్ డ్యాం భద్రతపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, డ్యాంను సందర్శించి పూర్తి నివేదిక ఇవ్వాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సభ్యులను సుప్రీంకోర్టు 2010లో ఆదేశించింది. కమిటీ సభ్యులకు రెండేండ్ల తర్వాతగానీ తెలివి రాలేదు. 2012లో వారు నివేదిక ఇచ్చారు. 2018లో మరోసారి కేరళలో వరద బీభత్సం సృష్టించింది. మళ్లీ డ్యాం భద్రతపై ఆందోళన వ్యక్తమయ్యింది. వెంటనే నివేదిక ఇవ్వాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. సావధానంగా 14 సమావేశాలను నిర్వహించిన సీడబ్ల్యూసీ సభ్యులు మూడేండ్ల తర్వాత అంటే 2021లో రిపోర్ట్ ఇచ్చారు.
మధ్యప్రదేశ్లోని కారమ్ నది మీద నిర్మిస్తున్న ధార్ డ్యామ్ గోడల్లో 2022లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని అక్కడి గ్రామస్థులు గుర్తించేవరకూ డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులు స్పందించలేదు. రెండ్రోజుల్లోనే పగుళ్లు ఏర్పడి కొంత భాగం కూలిపోయింది. దీంతో గంటలవ్యవధిలో 18 గ్రామాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. పగుళ్లకు కారణాలేంటో ఇప్పటివరకూ పూర్తి నివేదిక బయటకురాలేదు.
గత నెలలోనే సిక్కింలో కురిసిన భారీ వర్షాలకు చుంగ్తంగ్ హైడల్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. మొత్తంగా 175 మంది మృత్యువాతపడ్డారు. కోట్ల ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ ఇప్పటికీ నివేదికను విడుదల చేయలేదు. కేంద్రం చెప్తున్న డ్యాం సేఫ్టీ యాక్ట్ ఫిబ్రవరిలోనే అమల్లోకి వచ్చింది.
1979 నుంచి 2023 దాకా గత 44 ఏండ్లుగా, పలు రాష్ర్టాల్లో ప్రాజెక్టులు, డ్యామ్లపై కేంద్ర సర్కారు, కేంద్ర జల సంఘం పనితీరు ఇలా ఉంది. మరి తెలంగాణ విషయంలో…?
కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగినట్టు అక్టోబర్ 21న రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణకు ఒక పథకం కావాలని గానీ, కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వాలని గానీ ఏనాడూ కేంద్రానికి అక్షరం ముక్కరాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిల్లర్ కుంగుబాటుపై మాత్రం వెంటనే 22వ తేదీనే ఎన్డీఎస్ఏకి లేఖ రాశారు. 23న కేంద్ర బృందం హైదరాబాద్ వచ్చింది. 24న ఆగమేఘాలమీద హెలికాప్టర్లో వెళ్లి మేడిగడ్డను కేవలం సందర్శించిందంతే. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరీక్షలూ జరపలేదు. 25న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించింది. వారం గడవక ముందే నవంబర్ 3న ఏకంగా నివేదిక విడుదల చేసింది.