Inter Board | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీల అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కీలక నిర్ణయాలు తీసుకొన్నది. కాలేజీల్లో అదనపు తరగతులు 3 గంటలు మించొద్దని స్పష్టంచేసింది. రెసిడెన్షియల్ సహా డే స్కాలర్లు మధ్యలో చదువు మానేస్తే ఫీజు వాపసు చేయాలని సూచించింది.
ఈ మేరకు గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎవరైనా విద్యార్థి ఆరోగ్య సమస్యలు సహా ఇతరత్రా కారణాలతో మధ్యలోనే కాలేజీ మానేస్తే అనుమతించాలి. విద్యార్థి చెల్లించిన ఫీజులను 7 రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి. మొదటి మూడు నెలల్లో నిష్క్రమిస్తే 75శాతం, ఆ తర్వాత మూడు నెలల తర్వాత వెళ్లిపోతే 50శాతం, ఆ తర్వాత కాలేజీ మానేస్తామంటే 25శాతం ఫీజులు వాపసు చేయాలి. రెసిడెన్షియల్ కాలేజీలకు ఇది వర్తిస్తుంది.
కాలేజీలు జారీచేసే అడ్వర్టయిజ్మెంట్లపై గట్టి నిఘా పెట్టనున్నారు. తప్పుడు ప్రకటనలు, ఫేక్ ర్యాంకులను అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విభాగం అనుమతిస్తేనే కాలేజీలు ప్రకటనలు జారీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకొంటారు.