హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అంటేనే నమ్మకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాల తగ్గింపులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సారి మొదటి స్థానంలో నిలిచేలా సీఎం కేసీఆర్ రూ.499 కోట్లు వెచ్చించి గతంలో ఉన్న 3 ఎంసీహెచ్ హాస్పిటల్స్ను 27కు పెంచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని నిమ్స్లో రూ.55 కోట్లతో నూతనంగా నిర్మించతలపెట్టిన సూపర్స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్ నిర్మాణ పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వంద పడకల డయాలసిస్ యూనిట్, రూ.9 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యంత్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ, గతంలో కేవలం మదర్ అండ్ చైల్డ్ (ఎంసీహెచ్) హాస్పిటల్స్ మాత్రమే ఉండేవని, ఇప్పుడు రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 27 ఎంసీహెచ్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడంతోపాటు వసతులు, సిబ్బందిని పెంచామని, అధునాతన పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తత్ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మాతా మరణాలు ప్రతి లక్షకు 92 ఉంటే .. స్వరాష్ట్రంలో అది 43కు తగ్గిందని, శిశు మరణాలు 36 ఉంటే 21కి తగ్గించగలిగామని వివరించారు. గాంధీలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్, నిమ్స్లో 200 పడకలు, అల్వాల్లో కొత్తగా నిర్మిస్తున్న వెయ్యి పడకల హాస్పిటల్లో భాగంగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో మొత్తంగా 600 పడకల ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
నిమ్స్ ఆవరణలో రూ.55 కోట్లతో నిర్మిస్తున్న ఎంసీహెచ్ హాస్పిటల్ను భవిష్యత్తులో 8 అంతస్థులకు పెంచుకొని, ప్రత్యేక ఎంసీహెచ్ బ్లాక్గా ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. ప్రస్తుతం 4 అంతస్థుల్లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం సీహెచ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ తల్లులతోపాటు అప్పుడే జన్మించిన శిశువులకు అధునాతన సౌకర్యాలతో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
నిమ్స్లో ప్రస్తుతం ఉన్న 1,450 పడకలకు అదనంగా మరో 2 వేల పడకలతో హాస్పిటల్ను విస్తరించి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు హరీశ్రావు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా 100 పడకలతో డయాలసిస్ యూనిట్ను నిమ్స్లో ప్రారంభించినట్టు చెప్పారు. రోజుకు 1500 మంది రోగులకు సేవలు అందుతాయని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. నిమ్స్లో వైద్య సిబ్బందిని పెంచే క్రమంలో 34 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. నిమ్స్కు ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ కోసం రూ.150 కోట్ల గ్రాంట్ ఇచ్చామని వెల్లడించారు.
నిమ్స్ వైద్యులు, సిబ్బంది ఎంతో కష్టపడి మంచి సేవలు అందిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, నిమ్స్ లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేశ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.