హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రంపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మూడు లక్షల ఇండ్లు కేటాయించాలని కోరినప్పటికీ, కేంద్ర బడ్జెట్లో పీఎంఏవైకి కేటాయింపులు చూస్తుంటే.. అది ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. గృహ నిర్మాణ పథకం కేటాయింపుల్లో ఈసారి కేంద్రం రూ.3,300 కోట్లకుపైగా కోత విధించడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) సమన్వయంతో అమలుచేస్తున్న విషయం విదితమే. కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో, కేంద్ర సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇండ్ల నిర్మాణ కేటాయింపుల్లో కోత విధించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పీఎంఏవై (గ్రామీణ) పథకంపై రూ.32,327 కోట్లు ఖర్చుచేయగా, 2025-26లో 35,832 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు రూ.1,500 కోట్లు మంజూరుచేశారు. ఇండ్ల నిర్మాణ పురోగతి ఆధారంగా ఈ నిధులు విడుదల చేస్తున్నారు. కాగా, తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో పీఎంఏవైకి రూ.32,500 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులతో పోల్చుకుంటే రూ.3,300 కోట్లు తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో మంజూరుచేసిన 4.5 లక్షల ఇండ్లకు సుమారు రూ.22,500 కోట్లు అవసరం. కాగా, కేంద్రం ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల ఇండ్లకు రూ.1,500 కోట్లు మంజూరు చేయగా, పట్టణ ప్రాంతాల్లో 1,13,681 ఇండ్లు మంజూరు చేసింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడంలేదు. అలాగే, రాష్ట్ర సర్కార్ ఇప్పటివరకు ఇండ్ల లబ్ధిదారులకు దాదాపు రూ.2,500 కోట్లు అందజేసింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయగా, ఇందులో గ్రౌండింగ్ అయినవి రెండున్నర లక్షలు మాత్రమే. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర సర్కార్.. పట్టణ ప్రాంతాల్లో స్థలాల లభ్యత లేకపోవడం వల్ల ఇంకా ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. వాస్తవానికి, ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, ప్రభుత్వం మాత్రం 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారిలో స్థలాలు ఉండి ఇల్లు లేనివారు, ఇంటితోపాటు స్థలం కూడా లేనివారి సంఖ్య దాదాపు 45 లక్షల వరకు ఉన్నది.
ఇందులో 20 లక్షల మందికి ఇండ్లు మంజూరుచేస్తామని చెప్తున్న ప్రభుత్వం.. స్థలాల లభ్యత లేకపోవడం, కేంద్రం నుంచి నిధులు అందకపోవడంతో ఎలా ముందుకు పోవాలో అంతుబట్టక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మొదటి విడతలో మంజూరు చేసిన 4.5 లక్షల ఇండ్లు నిర్మించేందుకే ఆపసోపాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. 20 లక్షల ఇండ్లు ఎలా నిర్మిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటు కేంద్రం నుంచి సైతం సహకారం లభించడంలేదు. 2026-27 బడ్జెట్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు మూడు లక్షల ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర సర్కార్ కోరినప్పటికీ, కేంద్రం పేదల ఇండ్లకు చేసిన కేటాయింపులు చూస్తుంటే ఇది సాధ్యమయ్యే అవకాశంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
