హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతంగా ఉన్నదని, ఒక్క సామాజిక వర్గం కోసం సుమారు రూ.12 వేల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గొప్ప విషయమని కర్ణాటక షీప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిట్రావు చిద్రి కొనియాడారు. గురువారం హైదరాబాద్కు వచ్చిన ఆయన రాష్ట్ర షీప్ డెవలప్మెంట్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకం వివరాలు, ఫలితాలను బాలరాజు వివరించారు. ఈ సందర్భంగా పండిట్రావు చిద్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. కర్ణాటకలో ఇలాంటి పథకాల అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా లభించిందని బాలరాజు యాదవ్ వివరించారు. త్వరలోనే సుమారు మూడు లక్షలకుపైగా లబ్ధిదారులకు రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్టు తెలిపారు.