హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ వైస్చాన్స్లర్ నిర్ణయం తీసుకొన్నారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాజకీయ కార్యక్రమాలకు వర్సిటీలో అనుమతులు ఇవ్వరాదన్న గత నిర్ణయానికి అనుగుణంగా వీసీ ఆ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. ఈ నెల 7న రాహుల్ గాంధీతో విద్యార్థులు, నిరుద్యోగుల ముఖాముఖికి అనుమతి కోరుతూ ఏప్రిల్ 22 న వీసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఎన్ఎస్యూఐకి చెందిన నలుగురు దాఖలుచేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు తొలుత తగిన నిర్ణయం తీసుకోవాలంటూ వీసీని ఆదేశించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు వీసీ అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకొన్నారని సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ న్యాయవాది టీ శ్రీకాంత్రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శాంతిభద్రతల సమస్య కారణంగా రాజకీయపార్టీల సమావేశాలకు అనుమతి ఇవ్వరాదన్న తీర్మానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. దీంతో తొలుత జారీచేసిన ఉత్తర్వులను న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్ రెడ్డి సవరించారు. రిట్పై విచారణను మూసేస్తున్నట్టు ప్రకటించారు.
రాహుల్ సభకు అనుమతి లేదు: రిజిస్ట్రార్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించాలనుకొనే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతిలేదని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకొన్నవారికి ఏప్రిల్ 30 నే సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. నిరుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీసుకొన్న నిర్ణయం మేరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు యూనివర్సిటీలో అనుమతించబోమని స్పష్టంచేశారు. మరోవైపు ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలను అనుమతించేది లేదన్నారు. రాహుల్ కార్యక్రమానికి అనుమతిని మంజూరుచేయలేమని స్పష్టంచేశారు.
వీసీకి రేవంత్ క్షమాపణ చెప్పాలి
బీసీ వర్గానికి చెందిన ఓయూ వైస్ చాన్స్లర్కు చీర, గాజులు పంపి, కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి దిగజారిందని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ విమర్శించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీల వ్యతిరేకి అని ఆరోపించారు. రేవంత్తోపాటు చీర, గాజులు తెచ్చిన బల్మూరి వెంకట్ తక్షణమే ఓయూ వీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓయూతో సంబంధం లేని బల్మూరి వెంకట్ వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేస్తూ, వీసీని కించపరుస్తూ, హేళనగా తిట్టాడని విమర్శించారు. 1,200 మంది ఆత్మబలిదానాలకు కారకుడైన రాహుల్గాంధీ ఏ ముఖం పెట్టుకొని ఓయూ గడ్డమీద కాలుమోపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీ ముందుగా అమరుల తల్లులకు పాదాభివందనం చేసి, క్షమాపణ కోరి ఓయూ గడ్డపై కాలుమోపాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు జంపాల రాజేశ్, అలవాల మధుసూదన్, అశోక్యాదవ్, రవీందర్నాయక్, పూదూరి హరీశ్గౌడ్, చిరంజీవి బెస్త, భూషణ్, సోమశేఖర్, ప్రశాంత్, వెంకట్ పాల్గొన్నారు.
ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ వస్తారు?
రైతులను మళ్లీ మోసం చేయడానికే కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభలను నిర్వహిస్తున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పరామర్శించేందుకు కూడా రాలేని రాహుల్ గాంధీ.. ఇప్పుడు తెలంగాణకు ఎట్లా వస్తున్నారని ప్రశ్నించారు.