Indiramma Illu | హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉన్నవారు లేదా టెంట్ తరహా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటుచేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. లేకపోతే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున పక్కా ఇల్లు లేనివారిని గుర్తించేందుకు సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.5లక్షల ఇండ్లు కేటాయించగా, అందులో 2.5లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ర్టానికి 1.3లక్షల పట్టణ ప్రాంత ఇండ్లు సహా మొత్తం 4.5లక్షల ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కేంద్రం పట్టణ ఇండ్లకు రూ.1.5లక్షలు, గ్రామీణ ఇండ్లకు రూ.72వేల చొప్పున మంజూరు చేస్తుంది. కేంద్ర మార్గదర్శకాల్లో ముఖ్యంగా పక్కా ఇల్లు లేనివారు, ఇంట్లో రిఫ్రిజిరేటర్, కారు, మోటరైజ్డ్ వ్యవసాయ యంత్రాలు, రూ.50వేల పరిమితి వరకు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ), ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేక ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉంటే పీఎంఏవై పథకం కింద ఇల్లు పొందేందుకు అనర్హులు.
ఈ క్రమంలో మంజూరైన ఇండ్లకు నిధులు సక్రమంగా విడుదల కావాలంటే పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మించి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన లబ్ధిదారుల జాబితాలో చాలావరకు పేర్లను కేంద్రం తొలగించడంతో రాష్ట్ర సర్కార్ పునరాలోచనలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండ్లు నిర్మాణంలో ఉన్న లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు కొత్తగా లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిరుపేదలను మాత్రమే గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను ఆదేశించింది.