హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): గత ఏడాది పత్తి, కంది పండించిన రైతులకు కాసుల పంట పండింది. మద్దతు ధరకు రెట్టింపు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ రెండు పంటలకు ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వానకాలం సీజన్లో పత్తి, కంది పంటల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి పెట్టింది. ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. వానకాలం సీజన్లో మొత్తం 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో అగ్రభాగం పత్తికే కేటాయించింది. పత్తిని సుమారు 70-75 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మన పత్తికి భారీ డిమాండ్ ఉండటం, మద్దతు ధరకు రెట్టింపు ధర పలుకుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నది.
పత్తి పంట సాగు చేయడం ద్వారా రైతులకు మంచి ధర దక్కి.. లాభాలు వస్తాయనేది సర్కారు ఆలోచన. కంది సాగును కూడా 15 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. ఈ రెండు పంటలు పండించే రైతులు.. ప్రభుత్వంపై ఆధారపడే అవసరం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యాపారులే పోటీ పడి మరీ రైతుల వద్దకు వెళ్లి ఉత్పత్తులను కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం వరి సాగును తగ్గించాలని భావిస్తున్నది. గత ఏడాది 62 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ ఏడాది దాన్ని 50 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని యోచిస్తున్నది. గత వానకాలంలో 1.29 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాది కన్నా ఈ సారి అదనంగా 13 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
పంటల సాగుకు క్లస్టర్లు
వ్యవసాయ శాఖ రాష్ర్టాన్ని పంట క్లస్టర్లుగా విభజించింది. ఏ పంటకు ఏ ప్రాంతం అనుకూలమో గుర్తించి ఆ ప్రాంతాలను ఆ పంట క్లస్టర్లుగా గుర్తించింది. ఈ విధంగా అన్ని పంటలకు సంబంధించి మొత్తం 2,615 పంట క్లస్టర్లను గుర్తించింది. ఇందులో అత్యధికంగా 1,332 క్లస్టర్లను పత్తి సాగుకు, 1,064 క్లస్టర్లు వరికి, 82 కంది, సోయాబీన్ 21, మక్కజొన్న 9, ఇతర పంటలకు 369 క్లస్టర్లను గుర్తించింది. ఆయా క్లస్టర్లలో గుర్తించిన పంటలనే సాగు చేసేలా రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది.