హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పేద పిల్లలు చదువులో ముందుండాలంటే గురుకుల విద్య ద్వారానే సాధ్యమని విశ్వసించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 293గా ఉన్న గురుకులాలను ఇప్పుడు 1,002కు పెంచారు. నాడు వసతుల లేమితో 1.31 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదివేవారు. ఇప్పుడు సకల వసతులతో 5.59 లక్షల మంది విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గురుకులాలకు బడ్జెట్ కేటాయింపులు రూ.784 కోట్లు ఉండగా.. 2022-23 బడ్జెట్ నాటికి అది 3,400 కోట్లకు పెరిగింది.
విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుకు రూ.7,789 కోట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం ప్రభుత్వం మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 26,065 పాఠశాలల్లో దశల వారీగా మూడు దశల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనున్నారు. అందుకోసం బడ్జెట్లో రూ.7,289 కోట్ల నిధులను కేటాయించారు. మొదటి దశలో భాగంగా రూ.3,497 కోట్ల నిధులతో 9,123 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయించారు.
అదేవిధంగా విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించడం కోసం రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశపరీక్షల కోసం ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నది. రాష్ట్రంలో సాంకేతిక విద్యకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఎనిమిదిన్నర ఏండ్లలో కొత్తగా 14 పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఈ విద్యాసంవత్సరం మహేశ్వరం, మణుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ పరిధిలో ప్రభుత్వం 4 కొత్త ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది.
వంటలు చేసేవారి పారితోషికం రూ.3000లకు పెంపు
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. రాష్ట్రంలోని 28,606 పాఠశాలలకు చెందిన 25.26 లక్షల మంది విద్యార్థులతోపాటు, 4,237 హాస్టళ్లు, ఇతర విద్యాసంస్థలకు చెందిన 9.77 లక్షల మంది విద్యార్థులకు ఈ సన్నబియ్యం భోజనం అందిస్తున్నారు. దీని కోసం ప్రతి నెల 21,868 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని, పోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేస్తున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం కింద వంటలు చేసేవారి పారితోషికాన్ని ప్రభుత్వం రూ.1000 నుంచి రూ.3000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో విద్యా వికాసం కోసం వివిధ శాఖల ద్వారా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నది.