ఇప్పటికే ఉద్యోగులతో ఆడుకుంటున్న రేవంత్ సర్కార్.. తాజాగా వారికి మరో షాక్ ఇచ్చింది. కొత్త హెల్త్కార్డు ఇవ్వకముందే ప్రీమియం వసూలు మొదలుపెట్టింది. హెల్త్కేర్ ట్రస్టు ఏర్పాటు చేయలేదు.. మార్గదర్శకాలు జారీ చేయలేదు.. జీవో ఇవ్వలేదు.. దవాఖానలతో ఒప్పందం లేదు.. ఎంపికచేసిన హాస్పిటళ్ల జాబితా ప్రకటించలేదు. ఏ రోగానికి ఎంత ప్యాకేజీ అన్నది నిర్ధారించలేదు.. అన్నింటికి మించి ఉద్యోగుల అంగీకారం తీసుకోలేదు. అయినా తాజాగా ప్రీమియం మొత్తాన్ని కట్ చేసుకుని వేతనాలను చేతిలో పెట్టింది!
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబురంగా సంతోషం పంచుకునే సమయాన శుభవార్తను అందించాల్సిందిపోయి.. ఊహించని రీతిలో వేతనాల్లో కోతపెట్టి షాకిచ్చింది. ‘ఆలూ లేదు.. చూలూ లేదు’ అన్న చందంగా ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటు కాలేదు.. హెల్త్ కార్డులే ఇవ్వలేదు.. కానీ మే నెల మూలవేతనం నుంచే ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలు కోసం ప్రీమియం వసూలు షురూ చేసింది. ఒక్కో ఉద్యోగి మూలవేతనం నుంచి 1.5 శాతం చొప్పున వాటాను కట్ చేసింది. పే స్లిప్లో వేతనం కట్కావడాన్ని చూసుకున్న ఉద్యోగులు అవాక్కయ్యారు. తమ అనుమతి లేకుండా కోత విధించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
భార్యాభర్తలు ఉద్యోగులైతే ఆ ఇద్దరి నుంచి ప్రీమియం కట్ చేయడంపై మరింత దుమారం చెలరేగుతున్నది. ఈ విషయంపై ఉద్యోగులకు కనీస సమాచారం లేదు. ఉత్తర్వుల్లేవు. డ్రాయింగ్ ఆఫీసర్లకు కూడా సమాచారం లేదు. ఆటోమెటిక్గా ఉద్యోగుల ఖాతాల నుంచి ప్రీమియం కోత పెట్టారు. రాష్ట్రంలో 2,98,888 మంది ఉద్యోగులుంటే శనివారం వరకు 1,07,926 (36శాతం) ఉద్యోగులు మాత్రమే తమ కుటంబసభ్యుల వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేశారు. వీరి నుంచే కాకుండా అప్లోడ్ చేయని వారి ఖాతాల నుంచి ఈహెచ్ఎస్ ప్రీమియం కోత విధించింది. జూన్ నుంచి హెల్త్కార్డులిస్తామన్న సర్కార్ మే మాసం నుంచే ప్రీమియం కట్ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కార్ తీరును సోషల్ మీడియా వేదికగా దుయ్యబడుతున్నారు.
వేతనంపై సంపూర్ణ హక్కు ఉద్యోగిదేనని సుప్రీంకోర్టు గత తీర్పులు చెప్తున్నాయి. ఉద్యోగి పొందే జీతం ప్రభుత్వమిచ్చే భిక్ష కాదు. వారి కష్టానికి ప్రతిఫలం. ఆర్టికల్ 300-ఏ ప్రకారం జీతం, పెన్షన్ అనేవి ఉద్యోగుల ఆస్తి కిందికి వస్తాయి. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఉద్యోగి వేతనానికి కోతపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఆర్టికల్ 23 ప్రకారం వేతనంలో కోతపెట్టడం వెట్టిచాకిరీ కిందికి వస్తుంది. జీతంలో కోతకు ఉద్యోగి సమ్మతి తప్పనిసరి. సమ్మతి లేకుండా కోత విధించడం చట్టవిరుద్ధమని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వీటన్నింటినీ ఉల్లంఘించిందని ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి మన వద్ద 15వేలకు పైచిలుకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీవో) యూనిట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, కోతలు ఉన్నా.. ఈ డీడీవో విభాగం కట్ చేయాలి. ఇలా కట్ చేయాలంటే ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేయాలి. బిల్లులు సమర్పించాలి. ఆ మేరకే ఉద్యోగుల వేతనాల నుంచి వాటాను కట్చేయాలి. ఉద్యోగుల సమ్మతి లేకుండా. డీడీవోలకు తెలియకుండా ఆటోమెటిక్గా కట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని సంఘాల నేతలంటున్నారు. ‘మా జీతాల్లో కోతపెట్టడానికి మీకేం హక్కు ఉన్నది’ అని ప్రశ్నిస్తున్నారు.
జూన్ 2న రాష్ర్టావిర్భావ వేడుకల సందర్భంగా ఏదో ఒక శుభవార్త ఉంటుందని భావించిన ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సంఘాలతో ఇటీవల ప్రభుత్వం తరఫున నిర్వహించిన సమావేశం నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత వస్తుందని ఉద్యోగులు భావించారు. పీఆర్సీ ప్రకటిస్తారని, పెండింగ్లోని డీఏలను విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ, ఆఖరుకు వేతనాల్లోనే కోత పెట్టిందని లబోదిబోమంటున్నారు. పెండింగ్ బిల్లుల్లో మొత్తం క్లియర్ కాలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందలేదు. పైగా తమ జీతాలకే కోత పెడుతారా? అంటూ ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఈహెచ్ఎస్ ప్రీమియం నగదు కట్ చేశారు సరే. మరి సోమవారం నుంచి హెల్త్ కార్డులు పనిచేస్తాయా? ఉచిత ఆరోగ్య సేవలు అందుతాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
హెల్త్కార్డులు ఇవ్వకుండానే ఉద్యోగుల వేతనాల నుంచి ఈహెచ్ఎస్ ప్రీమియం కట్చేయడాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సర్కార్ తీరుపై భగ్గుమన్నాయి. డీడీవోలకు తెలియకుండానే బిల్లులు చేయకుండా ఆటోమెటిక్గా కట్ చేయడాన్ని ఖండించాయి. సర్కార్కు ఇంత తొందరెందుకని ప్రశ్నించాయి. ఈహెచ్ఎస్పై ఒక్క ముందడుగు పడకుండానే వేతనాల్లో కోతలు పెట్టడం అన్యాయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అభిప్రాయపడింది. వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వోడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా, వివరాలు సమర్పించకుండానే ప్రీమియం ఎలా కట్ చేస్తారని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య ప్రశ్నించారు. విధివిధానాలు రూపొందించకుండా 1.5 శాతం కట్ చేయడం అన్యాయమని, ఇలాంటి చర్యలతో ప్రభుత్వంపై నమ్మకం పోతుందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండానే ఈహెచ్ఎస్ కటింగ్ చేయడమేమిటని టీఎస్ యూటీఎఫ్ ప్రశ్నించింది. ఇలాంటి ఏకీకృత నియంతృత్వ నిర్ణయాలతో ప్రభుత్వం అభాసుపాలవుతుందని సంఘం అధ్యక్షుడు సీహెచ్ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ హెచ్చరించారు.
సర్కార్ తీరును సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి, సీపీఎస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బలవంతంగా ప్రీమియం మినహాయించడంపై టీపీటీఎఫ్ తీవ్ర నిరసనను వ్యక్తంచేసింది. సర్కార్ తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ (ఎస్ఎల్టీఏ టీఎస్) అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు చందూరి రాజిరెడ్డి, మల్లికార్జున్రెడ్డి, చింతకుంట జగదీశ్, ములుకనూరి శంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. డీటీఎఫ్ నేతలు సైతం వేతనాల కోతను తప్పుబట్టారు.
ఈహెచ్ఎస్ కోసం వేతన కోతలను తక్షణమే నిలిపివేయాలని ఎస్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. ఏకపక్ష చందా మినహాయింపును ఖండించింది. హెల్త్ స్కీమ్ విధివిధానాలు ఖరారు కాకముందే ప్రీమియం కోతపెట్టడం సరికాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఏకపక్షంగా కోత విధించడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, మినహాయించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరారు.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తమకొద్దని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. సీపీఎస్ ఉద్యోగులు, టీచర్ల వేతనాల నుంచి ఏకపక్షంగా కోత విధించడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. వేతనాల నుంచి 1.5 శాతం కోత విధిస్తూ ప్లే స్లిప్స్ జనరేట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఉద్యోగి జీతాన్ని కోత కోయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు.