హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్షించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలన్నారు. ఈ ప్రసంగాలను కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారుచేయాలన్నారు. మండుటెండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం వేళ హైదరాబాద్ రవీంద్ర భారతిలో, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.