ఖమ్మం జనవరి 16 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఎదిగితే రాష్ర్టానికి అంత లాభమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత కీలకపాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల గౌరవం అంత పెరుగుతుందని చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఉద్ఘాటించారు.
సోమవారం ఆయన ఖమ్మంలోని తెలంగాణభవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సభ చరిత్రాత్మక సభగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ సభకు అంచనాలకు మించి ప్రజలు తరలివస్తారన్న ధీమాను వ్యక్తంచేశారు.
ఖమ్మం సభతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు ఇం తమంది జాతీయ నాయకులు వస్తున్నారంటే దానికి కారణం సీఎం కేసీఆరేనని స్పష్టంచేశారు. ఆయన పరిపాలనా దక్షతను చూసి సభకు వస్తున్నారని కొనియాడారు. స్వరాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్దేనని చెప్పారు. ఒకప్పుడు ‘బెంగాల్లో ఏమి అమలవుతుందో దేశమం తా అదే అమలయ్యేది’ అనే నానుడి ఉండేదని, దానిని తిరగ రాస్తూ ఇప్పుడు ‘తెలంగాణ ఏది ఆచరిస్తుందో దేశమంతా అదే అనుసరిస్తున్నది..’ అనే నానుడి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనే కేంద్రం పేర్లు మార్చి అమలు చేస్తున్నదని ఉదహరించారు. ఇతర రాష్ర్టాలకు చెందిన రాజకీయ పార్టీలు తమ మానిఫెస్టోల్ల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు పెడుతున్నాయని గుర్తుచేశారు.
ఈ నెల 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అదే భవన సముదాయంలోని సమావేశ మందిరంలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ము ఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరాయి విజయన్తో కలిసి ప్రారంభిస్తారని హరీశ్రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ అతిథులకు కార్యక్రమం గురించి వివరిస్తారని చెప్పా రు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమై 4:30 గంటల వరకు కొనసాగుతుందని వివరించారు.
సభకు అతిథులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొంటారని తెలిపారు. అనంతరం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులను పోచంపల్లి శాలువాలతో సత్కరిస్తామని, కరీంనగర్ చేతివృత్తిదారులు తయారుచేసిన జ్ఞాపికలను అందజేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గాయకుడు సాయిచంద్ ఆధ్వర్యంలో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీర య్య, కందాళ ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం సభకు హాజరుకానున్న ఢిల్లీ, పం జాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరాయి విజయన్ మంగళవారం రాత్రికే హైదరాబాద్కు చేరుకుంటారని హరీశ్రావు తెలిపారు. 18న ఉదయం సీఎం కేసీఆర్తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని, అనంతరం హెలికాప్టర్లలో యాదా ద్రిని దర్శించుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఖమ్మం చేరుకుంటారని వెల్లడిం చారు. కేజ్రీవాల్, భగవంత్మాన్కు హోం మంత్రి మహమూద్ అలీ, విజయన్కు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అఖిలేశ్యాదవ్కు మం త్రి శ్రీనివాస్యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్వాగతం పలుకుతారని వివరించారు.
తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఖమ్మం స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నాడు నిరాహారదీక్షకు వెళ్తున్న కేసీఆర్ను అప్పటి పాలకులు ఖమ్మం జైలుకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఖమ్మం ప్రజలు కేసీఆర్కు అండగా నిలబడి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృ తం చేసేలా స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఉద్యమానికి జర్నలిస్టులు, టీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, కార్మికులు, విద్యార్థులు అందించిన స్ఫూర్తి వెలకట్టలేనిదని పేర్కొన్నారు.
అదే ఖమ్మం ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు వేదిక కాబోతున్నదని స్పష్టంచేశారు. 100 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహించే ఈ సభ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందన్న ధీమా వ్యక్తంచేశారు. సభా స్థలికి తూర్పు వైపున 230 ఎకరాలు, పడమర వైపు 210 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని వివరంచారు. 20 పార్కింగ్ స్థలాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజలను సమీకరిస్తున్నామని హరీశ్రావు తెలిపారు. వీటితోపాటు మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి జనసమీరణ చేస్తున్నామని వెల్లడించారు. సభకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్సాహంగా సభకు తరలివస్తున్నారని, వారి కోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, లారీలు, ఆటోలు సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం, వైరా నియోజకవర్గాల నుంచి ప్రజలు సభకు కాలినడకన వస్తున్నారని వెల్లడించారు. సత్తుపల్లి ప్రాంతం నుంచి వచ్చే వారికి ఏపీ నుంచి వాహనాలు సమకూరుస్తున్నారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మ న్లు, ముఖ్యనాయకులు వారికి కేటాయించిన గ్యాలరీలో కూర్చుంటారని చెప్పారు.