సిద్దిపేట, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓట్ల కోసం బీజేపీ నేతలు రాజకీయాలను మలినం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికులతోపాటు పాడి ఆవును కూడా వాడుకొంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ హామీ ఇచ్చిన కోట్లకొద్ది ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లలో వేస్తామన్న లక్షలకొద్ది డబ్బును ఎప్పుడు ఏస్తారో చెప్పాలని నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ ఆజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి శుక్రవారం 10 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాం, నూతన బస్స్టాండ్ను ప్రారంభించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందజేశారు. దుబ్బాక ముస్తాబాద్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అంతకు ముందు హబ్సిపూర్ నుంచి దుబ్బాక వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పాడి ఆవులను తెలంగాణ సమాజం అత్యంత పవిత్రంగా చూస్తదని, బీజేపీ మాత్రం పాడి ఆవు మొదలుకొని దేశ సైనికులను వరకు ఓట్లకోసం వాడుకొని రాజకీయాలను మలినం చేస్తున్నదని విమర్శించారు. పాడి ఆవులకు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉన్నదా? అని నిలదీశారు. ‘గోవును, సైనికుల, గుడిని, గుడిలోని దేవున్ని రాజకీయాలకు వాడుకొన్న నీచమైన చరిత్ర మీది.. మాది కాదు. మేం గోవును గోవుగా పూజిస్తాం. గుడిని గుడిగా భావిస్తాం. గుళ్లను నిర్మిస్తాం. భగవంతుని పూజిస్తాం. కానీ, మీలాగ వాడుకొని రాజకీయాలను మలినం చేయం’ అని బీజేపీ నేతలకు చురకలంటించారు.
రాష్ట్రంలో బీజేపీ వాళ్లు చేరికల కమిటీ అని ఓ కమిటీ వేసుకొన్నారు. ఎక్కడైనా చేరికల కమిటీలు వేస్తారా? అది చేరికల కమిటీ కాదు. పార్టీలను చీల్చే కమిటీ
– మంత్రి హరీశ్రావు
తెలంగాణలో 30 స్థానాల్లోపే బీజేపీ ప్రభావం ఉన్నదని ఆ పార్టీ నాయకుడు బీఎల్ సంతోష్ స్వయంగా ప్రకటించారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని ఆయనే కుండబద్ద్దలు కొట్టినట్టు చెప్పారని అన్నారు. ‘రాష్ట్రంలో బీజేపీ వాళ్లు చేరికల కమిటీ అని ఓ కమిటీ వేసుకొన్నారు. ఎక్కడైనా చేరికల కమిటీలు వేస్తారా? అది చేరికల కమిటీ కాదు. పార్టీలను చీల్చే కమిటీ’ అని విమర్శించారు. మంచి పనులు చేస్తే ప్రజలు దగ్గరకు వస్తారని, బీజేపీ మాత్రం పక్క పార్టీలను చీల్చి, పక్క పార్టీల లీడర్లను బెదిరించి నయానో.. భయానో గుంజుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ‘ఆ యాత్రలు.. ఈ యాత్రలని బీజేపీ నేతలు వస్తున్నారు.
యాత్రలు చేసుకోండి.. కానీ మీరు తెలంగాణకు, ఈ దేశానికి ఏం మంచి పని చేశారో ముందుగా చెప్పండి? రైతులకు ఏమన్నా చేస్తిరా? పేదలకు ఏమన్నా చేస్తిరా? కోట్లకొద్దీ ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఎక్కడిచ్చారు? ఎప్పుడిస్తారు? బ్యాంకుల్లో జన్ధన్ అకౌంట్లు తియ్యిండ్రి ధనాధన్ లక్షలకొద్ది డబ్బు ఏస్త్తమన్నరు.. ఏస్తిరా? ఎప్పుడేస్తరు? పెద్దనోట్ల రద్దు అని అందరిని బ్యాంకుల ముందు లైన్లల్ల నిలబెట్టిండ్రు.. ఎవరికన్నా పడ్డయా పైసలు? మీరు అధికారంలోకి రాంగనే తెలంగాణ ఏడు మండలాలు, సీలేరు పవర ప్లాంట్ను గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేస్తిరి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి డీజిల్ ధరలు, వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెంచి రైతులపై భారం మోపితిరి.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముడు, ఎల్ఐసీని అమ్ముడు, బీడీఎల్ భూములు అమ్ముడు, విశాఖ ఉక్కు కంపెనీని అమ్ముడు.. అన్నీ అమ్మితిరి.. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొడ్తిరి. యాత్రలు చెయ్యిండ్రి.. కానీ, రైతులకు ఆదాయం రెట్టింపు ఎప్పుడు చేస్తరో చెప్పుండ్రి. గ్యాస్ సిలిండర్ ధర ఎప్పడు తగ్గిస్తరో చెప్పుండ్రి. మీరు చేసిన మంచి పని ఏదైనా ఉంటే చూపించుండ్రి’ అని సవాల్ చేశారు. దేశంలో ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదని, తెలంగాణ ప్రభుత్వమే ఇస్తున్నదని గుర్తుచేశారు. ‘సీఎం కేసీఆర్ది పంచుడు వంతు అయితే.. బీజేపీ ధరలు పెంచుడు వంతు’ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా, దుబ్బాకపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇందుకు నిదర్శనం వంద పడకల దవాఖాన, బస్టాండ్, డబుల్ బెడ్రూం ఇండ్లు. అక్బర్పేట కొత్త మండలం ఏర్పాటు, మున్సిపాలిటీకి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు .. ఇవన్నీ సీఎం కేసీఆర్ చలవే. దుబ్బాకలో ఎమ్మెల్యే బీజేపీ కావొచ్చు. కానీ ప్రజలు తెలంగాణ వారే. ఇక్కడి ప్రజలే సీఎం కేసీఆర్కు ముఖ్యం
– మంత్రి హరీశ్రావు
దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్కు అత్యంత ఆత్మీయులని మంత్రి హరీశ్రావు అన్నారు. దుబ్బాక మీద కేసీఆర్కు ఎంతోప్రేమ ఉన్నదని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని తెలిపారు. ‘ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా, దుబ్బాకపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇందుకు నిదర్శనం వంద పడకల దవాఖాన, బస్టాండ్, డబుల్ బెడ్రూం ఇండ్లు. అక్బర్పేట కొత్త మండలం ఏర్పాటు, మున్సిపాలిటీకి కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిధులు .. ఇవన్నీ సీఎం కేసీఆర్ చలవే. దుబ్బాకలో ఎమ్మెల్యే బీజేపీ కావొచ్చు. కానీ ప్రజలు తెలంగాణ వారే. ఇక్కడి ప్రజలే సీఎం కేసీఆర్కు ముఖ్యం’ అని స్పష్టంచేశారు.
దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి మరువలేనిదని కొనియాడారు. మిగిలిపోయిన పనులు పూర్తి చేయడంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఉన్నదని పేర్కొన్నారు. ‘దుబ్బాకలో బస్టాండ్, తిరుపతికి బస్సు కోసం కష్టపడింది ఎంపీ ప్రభాకర్రెడ్డి. ఇక్కడి ఎమ్మెల్యేకు పనులు చేయడం చేతకాదు కానీ, కొబ్బరికాయ కొట్టేందుకు, రిబ్బన్ కట్ చేయడానికి, చేయని పనులను చేసినట్టు చెప్పుకోవటానికి మాత్రం ముందుంటాడు’ అని విమర్శించారు. బీజేపీ మాయమాటలు ఇక్కడ పనిచేయవని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టంచేశారు.
గోవును, సైనికులను, గుడిని, గుడిలోని దేవున్ని రాజకీయాలకు వాడుకొన్న నీచమైన చరిత్ర మీది.. మాది కాదు. మేం గోవును గోవుగా పూజిస్తాం. గుడిని గుడిగా భావిస్తాం. గుళ్లను నిర్మిస్తాం. భగవంతుని పూజిస్తాం. కానీ, మీలాగ వాడుకొని రాజకీయాలు మలినం చేయం
– మంత్రి హరీశ్రావు
దేశమే ఆశ్చర్యపోయేలా తెలంగాణలో వ్యవసాయం వృద్ధి చెందిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మూడేండ్లలో అదనంగా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ‘గతంలో కూడవెల్లి వాగులో దుమ్ము కనిపించేది. ఇవాళ వాగు 24 గంటలు పారుతున్నది. రాబోయే రోజుల్లో వ్యవసాయ పరిశ్రమలు తెచ్చి లక్ష మందికి ఉపాధి కల్పిస్తాం. కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపకుండా అన్నదాతకు అండగా నిలిచాం.
తొమ్మిది విడతలుగా రైతుబంధు ఇచ్చాం. ప్రస్తుతం వేస్తున్న పదో విడతలో శుక్రవారం వరకు మూడు ఎకరాల లోపు వాళ్లకు వేశాం. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు. 90 స్థానాల్లో గెలవటం కాదు కదా.. ఆ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి కనీసం డిపాజిట్లు తెచ్చుకోండి చూద్దాం. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యం’ అని తేల్చి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.