హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మెజారిటీ రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. వానకాలం సీజన్ కోసం సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి చేరనున్న నేపథ్యంలో దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు మార్కెట్ల్లో రికార్డు ధర పలుకుతుండడం, మరోవైపు వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ చెప్తుండటంతో రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం కూడా రైతులకు లాభాలు వచ్చే విధంగా పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది.
ఈసారి ఖరీఫ్ సీజన్లో 70-75 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఆ దిశగా పంట ప్రణాళికను సిద్ధంచేసుకుంది. ఆయా జిల్లాల్లో పత్తి సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి.. వాటిని ప్రత్యేక క్లస్టర్లుగా విభజించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలకు సంబంధించి 2,615 క్లస్టర్లను ఏర్పాటు చేయగా.. ఇందులో 1332 పత్తిసాగు క్లస్టర్లను గుర్తించింది. 2020-21లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. 2021-22లో ఇది 46.42 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పత్తిసాగు భారీగా తగ్గింది. దీంతో మార్కెట్ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్ హెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో రాష్ట్రంలో మళ్లీ పత్తిసాగును పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారీగా పెరిగిన ధర…
చరిత్రలో ఎప్పుడూలేని విధంగా గతేడాది పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మద్దతు ధర క్వింటాలుకు రూ. 6,025 ఉండగా మార్కెట్లో మాత్రం రూ.12,000 నుంచి రూ.12,500 వరకు ధర పలికింది. ఒక దశలో రూ. 13,500 ధర పలకడం గమనార్హం. దీంతో పత్తి రైతుకు కాసుల పంట పండింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా పత్తి సాగు తగ్గడమే డిమాండ్కు ప్రధాన కారణం. దీంతో పాటు తెలంగాణ పత్తి నాణ్యంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్లోనూ పత్తి ధరలు భారీగానే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విత్తనాలు సిద్ధం
ఈ సీజన్లో భారీ విస్తీర్ణంలో పత్తిసాగును లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. అందుకు అవసరమైన విత్తనాలను సమకూర్చుతున్నది. పత్తి పంటకు ఎకరానికి రెం డు ప్యాకెట్ల విత్తనాలు అవసరం. ఈ నేపథ్యంలో 80లక్షల ఎకరాలకు సరిపోయేలా 1.60కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వాటిని సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులతో విత్తన కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాలపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసిం ది. ముఖ్యంగా హెచ్టీ కాటన్ విత్తనాల సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.
రైతులకు అవగాహన…
వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో ప్రధానంగా పత్తి, కంది, నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నది. ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ సీజన్లో వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. క్షేత్రస్థాయిలో పత్తి, కంది, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.