హైదరాబాద్, అక్టోబరు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 119 నియోజకవర్గాల పరిధిలోని 35వేల పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ రోజున పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమవుతారు. నామినేషన్లు, ప్రచారం, వ్యయ పరిశీలన, ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియలో అధికారులు, సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తారు. వీరిలో కొన్ని విభాగాల వారికి శిక్షణ కూడా ప్రారంభమైంది.
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు సమాచారం అందించారు. ప్రిసైడింగ్ అధికారుల క్యాటగిరీ వరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు 1,96,312 మంది సిబ్బంది అవసరం కాగా.. అందుబాటులో 2,01,126 సిబ్బంది ఉన్నారని గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అత్యవసరంగా మరో రెండు శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉంటే పనులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎన్నికల విధి నిర్వహణ నుంచి అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, అధికారులను మినహాయించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్తు శాఖ తదితర అత్యవసర శాఖల సిబ్బందికి మినహాయింపునిచ్చారు.