హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందులో నాలుగు జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రకటించారు. ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమైన జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తేశామని స్పష్టం చేశారు. మిగతా ఐదు జిల్లాలోని 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆరు స్థానాలకు 26 మంది పోటీలో ఉండగా, 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదు జిల్లాల్లో 5,326 మంది ఓటర్లు ఉన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఓటర్లకు క్యాంపులు నిర్వహించడం నేరం అని చెప్పారు. క్యాంపు రాజకీయాలపై ఫిర్యాదులొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.
నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. వీరంతా టీఆర్ఎస్ అభ్యర్థులే. కాగా ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్లగొండ 1, మెదక్ 1, ఖమ్మం 1, కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు డిసెంబర్ 10న జరగనున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ తరపున ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, కరీంనగర్ నుంచి భానుప్రసాద్ రావు, ఎల్ రమణ బరిలో ఉన్నారు.