10th Results | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. మొత్తంగా ఈ ఏడాది 86.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 88.53 శాతం మంది బాలికలు, 84.68 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. యాజమాన్యాలవారీగా తీసుకొంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచాయి. అన్ని గురుకులాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణతశాతం కన్నా అధికంగా ఉత్తీర్ణతను నమోదు చేశాయి. కేజీబీవీలు, ఎయిడెడ్ స్కూళ్లు, జడ్పీ, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటుకంటే తక్కువగా ఉన్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫెయిల్ అయిన విద్యార్థులను టీచర్లు పలుకరించి, ఓదార్చాలని సూచించారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నామని, ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 9 మంది విద్యార్థుల సమాధాన పత్రాల గల్లంతు నేపథ్యంలో ఆయా విద్యార్థులు సాధించిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారిని పాస్ చేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాన్ని శ్రద్ధగా నిర్వహించిన అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు, ఇన్చార్జి డైరెక్టర్లుగా పనిచేసిన గాజర్ల రమేశ్, కే లింగయ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, మాడల్ స్కూల్స్ డైరెక్టర్ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ విద్యార్థులు 7,492 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,335 మంది (44.51శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్లో బాలురు 43.06, బాలికలు 47.73 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.
6,163 మందికి 10 జీపీఏ
పది ఫలితాల్లో 6,163 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. వీరిలో అత్యధికంగా 5,372 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచే ఉన్నారు. మరో 23 మంది ఎయిడెడ్, 200 మంది బీసీ వెల్ఫేర్, 9 మంది ప్రభుత్వ, 10 మంది కేజీబీవీ, 107 మంది మాడల్ స్కూల్స్, 59 మంది తెలంగాణ రెసిడెన్షియల్, 46 మంది మైనార్టీ గురుకులాలు, 126 మంది సోషల్ వెల్ఫేర్, 17 మంది గిరిజన గురుకులాలు, 184మంది జడ్పీ స్కూల్స్ విద్యార్థులు ఉన్నారు.
అత్యధికంగా గణితంలో ఫెయిల్
ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థులు గణితంలోనే ఫెయిల్ అయ్యారు. నిరుడుకూడా అత్యధికంగా మ్యాథ్స్లోనే అనుత్తీర్ణులయ్యారు. నిరుడుమాదిరిగానే ఈ ఏడాదికూడా అత్యధికశాతం మంది హిందీలో పాస్ అయ్యారు. ఈ సబ్జెక్ట్లో కేవలం ఒక శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష తప్పారు.
గురుకులాలు భళా
పది ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర సగటు 86.60 శాతం, ప్రైవేట్ స్కూళ్ల సగటు 90 శాతాన్ని మించి ప్రభుత్వ గురుకుల విద్యార్థులు ఉత్తీర్ణత సా ధించారు. బీసీ గురుకులాల నుంచి 18,079 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,7204 (95.16 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 214 మంది 10 జీపీఏ సాధించారు. మూడు జిల్లాల్లోని బీసీ గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, 30 జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 3 జిల్లాలు 83 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశాయి. గిరిజన గురుకులాల నుంచి మొ త్తం 6,383 మంది పరీక్షలు రాయగా, 5, 921 మంది (92.76 శాతం) ఉత్తీర్ణత సాధించడం విశేషం. 21 గురుకులాలు100 శాతం ఫలితాలు సాధించగా, 18 మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తాచాటారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు అత్యధికంగా 95.50 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం గర్వకారణం. ఎస్సీ గురుకులాల నుంచి 17,709 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 16,915 మంది (95.50 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 126 మంది 10 జీపీఏ సాధించగా, దాదాపు 82 గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం. మైనార్టీ రెసిడెన్షియల్స్ స్కూల్స్లోనూ 94.66 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
మంత్రుల అభినందన
పది ఫలితాలపై బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన, 10 జీపీఏతో సత్తాచాటిన విద్యార్థులను అభినందించారు. గురుకుల విద్యార్థులు భవిష్యత్తులోనూ మరిన్న విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అత్యధికం ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే..
పది వార్షిక పరీక్షలకు ఈ ఏడా ది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అత్యధికంగా హాజరయ్యారు. ఉత్తీర్ణుల్లోనూ వారే అధికంగా ఉన్నా రు. తెలుగు మీడియంలో అత్యధికులు ఫెయిల్ కాగా, ఇంగ్లిష్ మీడి యం విద్యార్థులు 90 శాతానికిపైగా ఉత్తీర్ణులయ్యా రు.
2,793 బడుల్లో వంద..25 స్కూళ్లలో జీరో
ఈ యేట రాష్ట్రంలోని 2,793 స్కూళ్లల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో 1,410 ప్రైవేట్ స్కూళ్లు, జడ్పీ 915, కేజీబీవీలు 91, మాడల్ స్కూళ్లు 38, ఆశ్రమ పాఠశాలలు 38, బీసీ గురుకులాలు 89, ఎస్సీ గురుకులాలు 73, గిరిజన గురుకులాలు 24, మైనార్టీ గురుకులాలు 55, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు 21, ఎయిడెడ్ 16, ఆశ్రమ పాఠశాలలు 38, ప్రభుత్వ బడులు 23 చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలోని 25 స్కూళ్లల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
నిర్మల్ ఫస్ట్.. సిద్దిపేట సెకండ్
పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం లో సిద్దిపేట జిల్లా ఉన్నది. నిరుడు సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా, నిర్మల్ రెండోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండు జిల్లాల స్థానం తారుమారయ్యింది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99%, సిద్దిపేట జిల్లాలో 98.65 ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది. 97.29 శాతంతో సంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి నిరుడుకూడా మూడోస్థానంలో నిలువగా, ఈ ఏడాది అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మహబూబ్నగర్ 71.25, నారాయణపేట 75.07 శాతంతో చివరి నుంచి వికారాబాద్కంటే వరుసగా ముందున్నాయి.
వచ్చే ఏడాది ఆన్స్క్రీన్ డిజిటల్ మూల్యాంకనం
పది వార్షిక పరీక్షల ఆన్సర్ షీట్లను ఆన్స్క్రీన్ డిజిటల్ మూల్యాంకనం చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతానికి జిల్లాల్లో క్యాంపులను నిర్వహించి పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారు. వచ్చే ఏడాదినుంచి టీచర్లు ఇంట్లో నుంచే వ్యాల్యుయేషన్ చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంటర్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఆన్స్క్రీన్ మూల్యాంకనాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. టెండర్లు ఆలస్యం కావడంతో ముందుకు సాగలేదు. పదిలోనూ ఆన్స్క్రీన్ డిజిటల్ మూల్యాంకనాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. 14న మొదలైన పరీక్షలు 22తో ముగుస్తాయి. విద్యార్థులు ఈ నెల 26 వరకు తాము చదివిన స్కూళ్లల్లోనే పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో పరీక్షలు ప్రారంభయ్యే రెండు రోజుల ముందు అంటే జూన్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. దీంతోపాటు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారవర్గాలు వెల్లడించాయి.