హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో అమలు చేస్తున్న తెలంగాణ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (టీఐడీఎస్ఎస్) సత్ఫలితాలనిస్తున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. ఆ విధానాన్ని ఈ ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నామని, ఇప్పటికే ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెన్సర్లను బిగించామని తెలిపారు. గురువారం జలసౌధలో ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులతో కలిసి వసార్ ల్యాబ్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, చెరువులన్నీ ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన టీఐడీఎస్ఎస్ పనుల పురోగతిని సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ విధానంతో రిజర్వాయర్లు, పంప్హౌజ్లు, కాలువల్లో నీటి ప్రవాహాలు, ఇన్ఫ్లోలు, ఔట్ఫ్లోల రియల్ టైమ్ డాటా అందుబాటులోకి వచ్చిందని వివరించారు. విడతలవారీగా రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులకు విస్తరిస్తామని, తొలి దశలో రిజర్వాయర్లు, వాతావరణ, వర్షపాతం డాటా, ఇన్ఫ్లోలు, ఔట్ ఫ్లోల అంశాలను పూర్తి చేయనున్నామని తెలిపారు.
మొత్తంగా 77 ప్రాజెక్టులు, 75 పంప్హౌజ్లు, చెరువులన్నింటినీ డీఎస్ఎస్తో అనుసంధానిస్తామని వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా 8 ఇరిగేషన్ సైట్లలో పర్యాటక అభివృద్ధి పనులను చేపడతామని, అందుకు అనువైన సైట్లను ఎంపిక చేశామని రజత్ కుమార్ తెలిపారు. ఈ ప్రదేశాల్లో 8 గెస్ట్ హౌజ్ల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో రాష్ట్ర పర్యాటక శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ)కు అప్పగిస్తామని వెల్లడించారు. మొత్తంగా 22 గెస్ట్హౌస్లతో పాటు వాటి ల్యాండ్ పార్సిల్లను ఖరారు చేసి టూరిజం శాఖకు ప్రతిపాదించామని, టీఎస్టీడీసీ బృందం ఆ సైట్లను ఇప్పటికే సందర్శించిందని తెలిపారు. ఏప్రిల్ 1 నాటికి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు, కాల్వల ఆటోమేషన్ తదితర అంశాలపైనా సంబంధిత అధికారులతో రజత్ కుమార్ సమీక్షించారు. కాళేశ్వరం మూడో టీఎంసీపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తాగునీటి పనులకు అనుమతి లభించటంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, బీ హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్, నాగర్కర్నూల్ సీఈ హమీద్ఖాన్, జాయిం ట్ సెక్రటరీ భీమ్ప్రసాద్, టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు.