హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అక్కడి స్టాళ్లను సందర్శించి, పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయాల ఫలితంగా తెలంగాణలోని కాలేజీల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) భారీగా పెరిగిందన్నారు.
దేశంలో సగటు జీఈఆర్ 27% ఉంటే.. తెలంగాణలో ఇది 39.1 శాతంగా ఉన్నదని చెప్పారు. గత పదేండ్ల నుంచి గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహిస్తున్న టీన్యూస్ ఇప్పటివరకు వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర కోర్సులపై అవగాహన కల్పించి, సమగ్ర సమాచారాన్ని అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ కోర్సుల వారికి మంచి ప్లేస్మెంట్ లభిస్తుంది? ఏ కాలేజీల్లో నాణ్యమైన విద్యావిధానం అందుబాటులో ఉన్నది ? ఎంసెట్లో ఏ ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్లో సీటు వచ్చే అవకాశం ఉన్నది? అనే వివరాలన్నీ ఒకే వేదిక ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర పలు రకాల కోర్సుల పట్ల విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎంతో మంది నిపుణులు అందుబాటులో ఉన్నారని, ఈ ఫెయిర్లో వివిధ కాలేజీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను విద్యార్థులు నేరుగా సంప్రదించి.. నచ్చి న కాలేజీలు, అందుబాటులో ఉన్న సీట్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 176 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో మొత్తం 1.10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని లింబాద్రి తెలిపారు. ఈ సీట్ల కోసం ఎంసెట్లో 1.56 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు వెల్లడించారు. సీట్ల కోసం ఎవరూ కన్సల్టెన్సీలను, మధ్యవర్తులను సంప్రదించవద్దని, వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికీ సీటు వస్తుందని చెప్పారు. వెబ్కౌన్సెలింగ్లో వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈసారి గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో 100కుపైగా కాలేజీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఉచిత ప్రవేశం కల్పించడంతో తొలి రోజే వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఫెయిర్ను సందర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల విద్యార్థులు వచ్చారు. స్టాళ్ల ప్రతినిధులను సంప్రదించి తాము చదువాలనుకుంటున్న కోర్సుల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, శ్రీదత్త విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి, గీతాంజలి విద్యా సంస్థల అసోసియేషన్ డీన్ అజయ్, నల్లా నరసింహారెడ్డి విద్యా సంస్థల ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్, టీన్యూస్ సీజీఎం ఉపేందర్, డిజీఎం కిరణ్, మార్కెటింగ్ సిబ్బంది సత్యపాల్రెడ్డి, శ్రీనివాస్, ఉదయ్భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4 వరకు కొనసాగనున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్కు శని, ఆదివారాల్లో మరింత భారీ స్పందన లభించే అవకాశాలున్నాయని నిర్వాహకులు తెలిపారు.