హైదరాబాద్, మార్చి 6 : రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.
నేడు బీఏసీ సమావేశం
మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీలో, సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ అధ్యక్షతన మండలిలో బీఏసీ సమావేశం వేర్వేరుగా నిర్వహించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ జరగాలి? అన్నదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకొంటారు. మంత్రి హరీశ్రావుకు ఇది మూడో బడ్జెట్. టీఆర్ఎస్ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నారు. సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ శనివారం సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. స్పీకర్ ఆదేశాలతో సభ నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈసారి మండలికి కొత్తగా ఎన్నికైన 19 మంది సభ్యులు హాజరవుతారు. వీరిలో 10 మంది తొలిసారి మండలిలో కాలుమోపుతున్నారు. మండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ తొలిసారి సభను నిర్వహించనున్నారు.
అనేక ప్రత్యేకతల మండలి
శాసనమండలి చైర్మన్ ప్రొటెం అమినుల్ హసన్ జాఫ్రీ తొలిసారిగా సమావేశాలను నిర్వహించనున్నారు. గత సమావేశాల్లో చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డి ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ సభలో అడుగుపెడుతున్నారు. అసెంబ్లీకి తొలి స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి మండలికి వస్తున్నారు. స్థానిక సంస్థల కోటాలో 12 మంది, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, గవర్నర్ కోటాలో ఒక్కరు ఎమ్మెల్సీలుగా ఇటీవలే ఎన్నికయ్యారు. వీరిలో స్థానిక సంస్థల కోటాలో ఎల్ రమణ, ఎంసీ కోటిరెడ్డి, దండె విఠల్, డాక్టర్ యాదవరెడ్డి, తాతా మధుసూదన్ ఎమ్మెల్సీలుగా తొలిసారి హాజరవుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, వెంకట్రామ్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి కూడా తొలిసారి సభలో అడుగుపెడుతున్నారు. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాల్లో గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, భానుప్రసాదరావు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.