BJP | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామాన్ని జపించడమే తప్ప మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ మోదీ నామస్మరణకే పరిమితమైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకొచ్చింది.
అదే సమయంలో బీసీ, ఎస్సీలను ఆకట్టుకునేందుకు పెద్దఎత్తుగడ వేసింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ వర్గీయుడిని ముఖ్యమంత్రిని చేస్తామని స్వయంగా మోదీతో చెప్పించింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ నిర్వహించిన సభకు మోదీని రప్పించి, ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మరో ప్రకటన చేయించింది. తద్వారా బీసీలు, ఎస్సీలు ఏకపక్షంగా తమకు ఓట్లు వేస్తారని, దీంతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ కలలుగన్నది.
కానీ, ఆ నినాదాలతో బీజేపీ ఓట్ల శాతం పెరగడం తప్ప ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ రెండు నినాదాలు లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయవని బీజేపీకి తెలిసొచ్చింది. అయినా ప్రస్తుతానికి మోదీ మంత్రం తప్ప కమలనాథులకు వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కొత్తగా ఏ నినాదాన్ని ఎత్తుకోవాలో, ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ వాదాన్ని వినిపించాలో వారికి అర్థం కావడం లేదు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కంటే బీఆర్ఎస్పై రొడ్డకొట్టుడు విమర్శలు చేసేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రేవంత్రెడ్డి సర్కారు హామీలను నెరవేర్చకపోయినా,కాంగ్రెస్పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పష్టమైన కార్యాచరణను లేకుంటే ప్రజలు బీజేపీని నమ్మరని ఆ పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి.