హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో సగటున 4.97 మీటర్ల లోతున జలాలు ఉన్నాయి. బుధవారం విడుదలచేసిన నవంబర్ నెల నివేదికలో భూగర్భ జలశాఖ వెల్లడించింది. రాష్ట్ర సాధారణ వర్షపాతం 841 మిల్లీమీటర్లు కాగా.. ఈ సీజన్లో 1,101 మిల్లీమీటర్లు నమోదైంది. దాదాపు 31 శాతం అధిక వర్షపాతం నమోదుకావడంతో 33 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 4.97 మీటర్లు ఉండగా, కనిష్ఠ నీటి మట్టాలు హనుమకొండ జిల్లాలో 2.67 మీటర్లు, గరిష్ఠ నీటి మట్టం సంగారెడ్డి జిల్లాలో 8.30 మీటర్లుగా నమోదైంది. 2020 నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో 3.37 మీటర్లు గరిష్ఠంగా భూగర్భ జలమట్టం పెరిగింది. కనిష్ఠంగా 0.06 మీటర్లు పెరిగింది.
ముఖ్యంగా ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, వికారాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, ఆసిఫాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబాబాద్, వరంగల్, యాద్రాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, జనగామ, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నారాయణపేట, హనుమకొండ, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైంది. నవంబర్లో సరాసరి నీటిమట్టం 4.97 మీటర్లుగా నమోదైంది. మొత్తం 33 జిల్లాలకు 16 జిల్లాల్లో సరాసరి నీటిమట్టం 20 మీటర్లుగా నమోదైంది. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ లోతులో భూగర్భ జలమట్టాలున్నట్టు గుర్తించారు. గత ఏడాది నవంబర్తో పోలిస్తే భూగర్భ జలాల మట్టం 0.02 మీటర్ల (2 సెంటీ మీటర్లు) మేర దిగువకు వెళ్లాయని గుర్తించారు. 16 జిల్లాల్లో 0.06 నుంచి 3.37 మీ, 17 జిల్లాల్లో 0.02 నుంచి 1.82 మీ తగ్గుదల నమోదైంది. పదేండ్లలో నవంబర్ నెలలో భూగర్భ జలమట్టాల సరాసరి పరిశీలిస్తే.. 2011-2020 నుంచి 594 మండలాలకుగాను, 573 మండలాల్లో 0.06 నుంచి 13.62 మీటర్ల పెరుగుదల కనిపించింది. 21 మండలాల్లో 0.01 నుంచి 3.64 మీటర్లకు తగ్గింది.