హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఇన్నోవేషన్ క్యాపిటల్గా అవతరించిందని సింగపూర్కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఎన్టీయూ) వైస్ప్రెసిడెంట్ టిమ్ వైట్ కొనియాడారు. రాష్ట్రం విద్యాకేంద్రంగా, పారిశ్రామికాభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఎన్టీయూ ప్రతినిధి బృందం సోమవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని సందర్శించింది. ఈ సందర్భంగా పలు వర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న టిమ్ వైట్.. రాష్ట్రంలో అమలవుతున్న విద్యాపరమైన సంస్కరణల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ వర్సిటీలతో త్వరలోనే విద్యాఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామని వెల్లడించారు. 3 నుంచి 5 ఏండ్ల కాల వ్యవధి గల ఈ ఒప్పందం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. షార్ట్టైమ్ ఇంటెన్సివ్, ట్రైనింగ్, ఫ్యాకల్టీ ట్రైనింగ్లలో పరస్పర సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ పరిశోధనలను ప్రోత్సహించేందుకు తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక కంపెనీలు వస్తున్న నేపథ్యంలో విద్యలో సాంకేతికతను అనుసంధానించేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించాలని తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ఎస్కే మహమూద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.