ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా..
ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా.. ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా.. టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా.. యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా.. ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణ. కేసీఆర్ కార్యదక్షతకు ఇదొక నిదర్శనం. ఏబుటల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పెట్టుబడులు వస్తాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యం గోరటి వెంకన్న గతంలో పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే.. పల్లె కన్నీరు పెడుతుందో అని రాశారు. ఇప్పుడు తెలంగాణ పల్లెలు సంతోషంగా ఉన్నాయి. పల్లెలు కన్నీరు పెట్టడం లేదు. కానీ ప్రతిపక్షాలు కన్నీరు పెడుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పలురంగాల్లో దేశానికే దిక్సూచిగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. టీఎస్ఐపాస్, రైతుబంధు, రైతుబీమా వంటి దేశం గర్వించదగ్గ పాలసీలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. పరిశ్రమలను ఆకర్షించడంలో ఇతర దేశాలతో పోటీపడుతున్నామన్నారు. మరో ఇరవై ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమల రంగంపై స్వల్పకాలిక చర్చలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పెట్టుబడులు, ఉపాధికి పెద్దపీట వేసే ఐటీ, పరిశ్రమలపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలన్నారు. దేశంలో డిజిటల్ విప్లవమే నాలుగో పారిశ్రామిక విప్లవమని, దీన్ని అందుకోవటానికి యువశక్తిని సమర్థంగా వాడుకొంటే తిరుగుండదని కేటీఆర్ అన్నారు. నానో టెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజి, డాటా స్టోరేజి వంటివి డిజిటల్ విప్లవంలో భాగమేనని, ఎమర్జింగ్ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్తో ఇండ్ల తయారీ టెక్నాలజీ వస్తున్నదని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే ‘త్రీ ఐ మంత్రా’ను చేపట్టినప్పుడే శకిమంతమైన కొత్త భారతాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే ఈ ‘త్రీ ఐ’ మంత్ర అని చెప్పారు. అంతరాలులేని సమ్మిళిత అభివృద్ధి సాధనే దీని లక్ష్యమన్నారు. ఏడేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో ఇది చేసి చూపామని తెలిపారు.
కేంద్రం నివేదికలే తార్కాణం
తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. నీటి పారుదలలో అసాధారణ ప్రగతి జరిగిందని కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మన కండ్లముందు పండుతున్న పంటలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రపంచంలోని ఏ దేశమైనా జనాభాలో 2 నుంచి 5 శాతానికన్నా ఎక్కువమందికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేదని.. మన రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే 2 శాతం అంటే ఏడెనిమిది లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. అందరికీ ఉద్యోగాలివ్వాలంటే ప్రైవేటు రంగం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రైవేటు పెట్టుబడుల ఆవశ్యకతను ముందే గ్రహించిన సీఎం కేసీఆర్.. 2014లోనే టీఎస్ఐపాస్ తెచ్చారని తెలిపారు. కరెంటు సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. కమిట్మెంట్, పట్టుదలతో కష్టపడి సాధించిన రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలనే పట్టుదల ఇతరులకు ఉండవని, రాష్ర్టాన్ని ప్రగతిపథాన నడిపించాలన్న ఆరాటం సీఎంకు మాత్రమే ఉన్నదని అన్నారు.
విపక్ష నేతలే అభివృద్ధికి అంబాసిడర్లు
ప్రతిపక్ష నేతలు ఒకరు నిరుద్యోగ గర్జనని, మరొకాయన ఉద్యోగాలు ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ చేస్తానంటున్నారన్న కేటీఆర్.. నిజానికి వారే తమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని చమత్కరించారు. వారు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయని చెప్పారు. వారు యాత్రల సందర్భంగా నీరు, పచ్చదనం, చెరువుల్లో చేపలు, ఇంటింటి ముందు మంచినీటి నల్లాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గతంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు నేడు ఇతర రాష్ర్టాలనుంచి వలస వస్తున్న పరిస్థితి నెలకొనడం సంతోషకరమని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలవల్లే ఈ ప్రగతి సాధ్యమైందన్నారు.
20 ఏండ్లు టీఆర్ఎస్దే ప్రభుత్వం
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కట్టుకథలతో పరిశ్రమలు రావని, కష్టపడితేనే వస్తాయని అన్నారు. అమెరికా నుంచి ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడాలంటే రాత్రి పది గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. అయినా కొందరు రాష్ర్టానికి, టీఆర్ఎస్కు మంచిపేరు వస్తుందేమో అనే దుగ్ధతో రాష్ర్టాన్ని నిందించేలా మాట్లాడుతున్నారని, ఇది మంచిదికాదని హితవు పలికారు. టీఆర్ఎస్ మరో 20 ఏండ్లు అధికారంలో ఉంటుందని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ బాగుండాలన్నదే తమ లక్ష్యమని, టాటాలు మాత్రమే కాదు.. తాతలనాటి కులవృత్తులు కూడా బాగుండాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. ఇందులో భాగంగానే సమ్మిళిత అభివృద్ధి వైపు దృష్టి సారించామని వివరించారు.
ఫార్మా క్లస్టర్పై చిల్లర రాజకీయాలు
హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్గా నిలువబోతున్నదని కేటీఆర్ అన్నారు. 12 వేల పైచిలుకు ఎకరాలకుగాను 10,400 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని చెప్పారు. భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని, ఇప్పటికే 150 మందికి మహేశ్వరంలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇందులో ఒక్క ఇంచు భూమిని కూడా ఎవరికీ కేటాయించలేదని స్పష్టంచేశారు. కానీ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీంపట్నంలో సభ పెట్టి, ప్రభుత్వం భూములను అమ్ముకుంటున్నదని ఆరోపించారని, ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఫార్మా సిటీకి రూ.60-65 వేల కోట్లు పెట్టుబడులు రావాలని, ఐదారు లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించాలని, హైదరాబాద్ దక్షిణ ప్రాంతానికి పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం, విపక్ష, జాతీయ నేతలు మెచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత శశిథరూర్ వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి పొగడలేని స్థితికి వెళ్లిపోయారని, అభినందించారని చెప్పారు. తర్వాత ఆయన తిట్లు పడ్డారని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని పొడిగితే ఓర్వలేకపోతే ఎట్లా? అని ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన రూ.లక్ష కోట్లు పంటల రూపంలో తెలంగాణకు వస్తున్నది కదా. ఉత్పాదకరంగంపై పెట్టే ఖర్చు అప్పు కాదు.. భవిష్యత్తు కోసం పెట్టుబడి. అర్థం చేసుకోలేనివాళ్లు అప్పుల కుప్పయిందని మాట్లాడుతుంటరు’ అని విమర్శించారు.
అద్భుతంగా ఐటీ ప్రగతి
ఐటీలో తెలంగాణ గణనీయ వృద్ధి నమోదు చేసిందని, ప్రపంచంలోని టాప్ 5 టెక్నాలజీ కంపెనీలు రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో కలిగి ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లకు, ఉద్యోగాల కల్పన 6.28 లక్షలకు చేరిందన్నారు. డ్రోన్ పాలసీ, డాటా సెంటర్, ఇన్నోవేషన్, రూరల్ టెక్నాలజీ, ఓపెన్ డాటా, సైబర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ పాలసీ వంటి గర్వించదగ్గ విధానాలను తీసుకువచ్చామన్నారు. సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో నల్సార్ వర్సిటీతో కలిసి కొత్త పాలసీ తెస్తున్నామని చెప్పారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కృషిచేస్తామని శశిథరూర్ చెప్పినట్టు తెలిపారు. స్టేట్ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా 3 లక్షల పైగా పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. 33 జిల్లాల్లో న్యాక్, సెట్విన్, టాస్క్ ద్వారాదీన్ని విస్తరిస్తామన్నారు. దేశంలో మొదటిదైన టీ-వ్యాలెట్ను 12 లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారని, 2.67 కోట్లమంది సేవలు పొందారని, 13,663 కోట్ల నగదు బదిలీ జరిగిందని అన్నారు.
కేంద్రం ఏం చేసింది?
మూతబడ్డ సిర్పూర్ పేపర్మిల్లును కష్టపడి తెరిపించామని, రామగుండం ఫర్టిలైజర్స్ త్వరలో మొదలవుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మధ్య తరహా పరిశ్రమలనూ తెరిపిస్తున్నామని, చిన్న పరిశ్రమలను కాపాడుకునే ప్రయత్నంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రారంభించామని చెప్పారు. ఇప్పటిదాకా 334 చిన్న పరిశ్రమలను ఆదుకొన్నామన్నారు. తెలంగాణకు ఇప్పటివరకు కేంద్రం ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. పారిశ్రామికీకరణ అన్ని వైపులా జరగాలని 5 ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు కోసం సాయం అడిగితే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్కు రూ.1000 కోట్లు అడిగితే ఉలుకూ పలుకూ లేదన్నారు. ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమలకు దిక్కులేదని గుర్తుచేశారు. బయ్యారంతోపాటు మహబూబ్నగర్ జిల్లా గట్టులో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇంకోటి పెడుతామని ఎన్ఎండీసీ వార్షికోత్సవ సభలో అప్పటి కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని గుర్తుచేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ నిమ్జ్, నేషనల్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, ఆదిలాబాద్లో గిరిజన వర్సిటీ.. ఇలా ఎన్నో అడిగినా స్పందన లేదని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తిరిగి ప్రారంభించాలని కోరితే, ప్రారంభించే సమస్యే లేదని, అవసరమైతే అమ్ముదామంటూ ఉత్తరం రాశారంటూ కేంద్రం వైఖరిని ఎండగట్టారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ను రద్దు చేశారని మండిపడ్డారు. బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు ఉండి ఏం తెచ్చారని నిలదీశారు.
ఎవరిపై మిలియన్ మార్చ్ చేస్తారు?
మా నినాదం స్టార్టప్ అయితే, కేంద్రం నినాదం ప్యాకప్ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. పెట్టుబడుల ఉపసంహరణ మిషన్ అని చెప్పి పీఎస్యూలను అమ్ముతున్నారని చెప్పారు. పైగా ‘రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ చేస్తం’ అంటున్నారన్న కేటీఆర్.. ‘ఎవరి మీద మిలియన్ మార్చ్ చేస్తరు? కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మే మీరు చేస్తరా మిలియన్ మార్చ్?’ అని చురకలేశారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కాకుండా, ఆయా సంస్థల్లో ఉండే లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తరా? కేంద్ర ప్రభుత్వంలో 8.32 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 40, 50 వేల ఖాళీలు ఉంటేనే లొల్లి చేస్తరు. ఇక్కడి బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే.. ఇస్తడనుకొన్నం. ఊడగొడుతడనుకోలేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
వ్యాపారవేత్తలే పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు
ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న వ్యాపారవేత్తలు సంతోషంగా ఉంటే కంపెనీలను విస్తరిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఇతరులకు రాష్ట్రం గురించి చెప్తారు. ఫలితంగా కొత్తవాళ్లు వస్తారు. ఇం దుకు ఉదాహరణ హెచ్ఎస్ఐఎల్. సొమాని టైల్స్ అ ధిపతి సందీప్ సొమానికి చెందిన ఈ సంస్థకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు యూనిట్లు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పనితీరు, పాలసీలు నచ్చి ఏడేండ్లలోనే ఆరు కొత్త యూనిట్లు పెట్టారు. కొత్తగా 300కు పైగా భారీ కంపెనీలు ఉన్నాయి. మెట్రానిక్స్ అనే మెడికల్ డివైజెస్ కంపెనీ రూ.1200 కోట్లతో ఆర్అండ్డీ సెంటర్ను పెట్టింది. ఆసియాలోనే పెద్ద స్టంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూ నిట్ సుల్తాన్పూర్లో ఏర్పాటవుతున్నది’ అన్నారు.
ఇదీ మా దక్షత
‘ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవికి మద్దతుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ యాజమాన్యాల సమావేశంలో పాల్గొన్నా. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ అధిపతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఐతవోలు అని, ఎప్పటికైనా కేసీఆర్కే ఓటువేస్తానని చెప్పారు. ఎందుకు అని అడిగా. ఐతవోలులో తనకు 40-50 ఎకరాల పొలం ఉన్నదని, గతంలో మీ పొలం ఎక్కడ? అని అడిగితే చెరువు కింద ఉన్నదని చెప్పేవాడినని అన్నారు. సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడంతో ఇప్పుడు చేను కిందికే చెరువు వచ్చిందని గర్వంగా చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని నేను అడిగితే.. ‘ఆంధ్రాలో మాదిరిగా ఆక్వాకల్చర్, చేపల చెరువులు చూడాలని ఉన్నది’ అని అన్నారు. వలసల జిల్లాలో ఏడేండ్లలోనే చేపల చెరువులు చూడాలనడం మా దక్షత కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
టీఎస్ఐపాస్ను అనేక రాష్ర్ర్టాలు అనుకరిస్తున్నాయని, కేంద్రం కూడా సింగిల్విండో సిస్టంను ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి గోయల్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. గతంలో ‘ఈ రోజు బెంగాల్ ఏమి ఆలోచిస్తుందో ఇండియా రేపు ఆలోచిస్తుంది’ అనే నానుడి ఉండేదని, ఇప్పుడు ‘తెలంగాణ నేడు ఏం చేస్తుందో.. రేపు ఇండియా చేస్తుంద’ని.. చెప్పుకోవడం గర్వంగా ఉన్నదని తెలిపారు. మిషన్ భగీరథ.. జల్జీవన్ మిషన్కు, రైతుబంధు.. పీఎం కిసాన్కు ఆదర్శంగా మారాయని, అర్బన్ లంగ్ స్పేసెస్, అర్బన్ పార్కులు నేడు నగర్వన్ అనే కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచాయని వెల్లడించారు. అనుకరణ కూడా ఒక విధమైన అభినందనే అన్నారు. ఈవోడీబీలోనూ రాష్ట్రం తొలి మూడు స్థానాల్లో ఉన్నదన్నారు. పరిశ్రమల అనుమతుల విషయంలో 1,264 సంస్కరణలు తెచ్చామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని చెప్పారు. ఇటీవల కేరళకు చెందిన కిటెక్స్ సంస్థ కేరళనుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించిన వెంటనే మన దేశంలోని 15 రాష్ర్టాలతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కూడా సంప్రదించడం ఇందుకు తార్కాణమని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రోత్సాహకాలు చాలా పారదర్శకంగా ఉన్నాయని, ఉమ్మడి ఏపీలో నీకెంత, నాకెంత అనే విధంగా పరిస్థితి ఉంటే.. నేడు మీ వల్ల తెలంగాణకు, తెలంగాణ యువతకు దక్కేదెంత? అనే అంశంపైనే ఆలోచిస్తున్నామని తెలిపారు. అండర్ ద టేబుల్ కార్యక్రమాలకు తావులేదన్నారు. వివిధ రాయితీలు కల్పిస్తూ పెట్టుబడులు తెస్తున్నామని చెప్పారు.
ఓల్డ్ సిటీలో టాస్క్, టీహబ్, వీహబ్
పాతబస్తీలో టాస్క్, టీ-హబ్, న్యాక్, వీ-హబ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముస్లిం మైనార్టీలకు 705 యూనిట్లకు అనుమతులు ఇవ్వగా, రూ.800 కోట్ల పెట్టుబడులు జరిగాయని, దాంతో 6,800 ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. కొంపల్లి దగ్గర ఐటీ టవర్, దుండిగల్ వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కొత్త మైనింగ్ పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందిందని, త్వరలో వస్తుందన్నారు. హుజూర్నగర్లో డ్రైపోర్టు ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. దసరా తర్వాత వర్క్ ఫ్రం ఆఫీస్ కల్చర్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.