పెద్దమందడి, నవంబర్ 15: అన్ని వర్గాల ప్రజలకు చేతినిండా పనులు కల్పించి బతుకుదెరువుకు దారి చూపిన బీఆర్ఎస్ సర్కారుకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. మాయమాటలు చెప్పే ప్రతిపక్ష పార్టీల నేతలను నమ్మి మోసపోవద్దని సూచించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. వానకాలంలో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఆంధ్రాలో కేవలం 38 లక్షల ఎకరాల్లోనే పంట పండిందని తెలిపారు.
వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుంట కూడా బీడు ఉండొద్దనే ఉద్దేశంతో కాల్వల ద్వారా సాగునీరందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందని గడప లేదన్నారు. 11 సార్లు కాంగ్రెస్కు అధికారమిస్తే చేసిందేమీ లేదని.. చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పామిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మీకే ఓటేస్తామంటూ రైతుల భరోసా..
పామిరెడ్డిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మంత్రి నిరంజన్రెడ్డి ముచ్చటించారు. వ్యవసాయం ఎలా ఉన్నదని మంత్రి ప్రశ్నించగా.. ‘మీరు సాగునీరు తీసుకురావడం వల్లే ఇన్ని ధాన్యపు రాసులు వచ్చాయి. మేము ఏ పార్టీ వారు వచ్చినా పట్టించుకోం. అన్నం పెట్టే రైతన్నలంతా మిమ్మల్నే గెలిపించుకుంటారు’ అని వారు తెలిపారు.